ప్రాణం తీసిన కట్న దాహం: బెంగళూరులో మహిళా టెక్కీ ఆత్మహత్య
అదనపు కట్నం వేధింపులు తాళలేక అనంతపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు జాహ్నవిరెడ్డి(25) బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడింది.
బెంగళూరు/అనంతపురం: అదనపు కట్నం వేధింపులు తాళలేక అనంతపురంకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీరు జాహ్నవిరెడ్డి(25) బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోవూర్నగర్కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సూర్యప్రతాప్రెడ్డి కుమార్తె జాహ్నవికి రెండేళ్ల కిందట హైదరాబాద్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీరు విద్యాసాగర్రెడ్డికి వివాహం జరిగింది.
అప్పటి వరకు చెన్నైలో సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తున్న జాహ్నవి భర్త నిర్ణయం మేరకు ఉద్యోగాన్ని మానేసింది. ఆపై వీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు. వివాహం సందర్భంలో రూ.కోటి నగదు, కిలో బంగారు ఆభరణాలు, కొన్ని స్థలాలను ఇచ్చారు జాహ్నవి తల్లిదండ్రులు. కాగా, వివాహం అయిన ఆరు నెలల నుంచి అదనపుకట్నం కోసం భర్త వేధింపులు ప్రారంభమయ్యాయి.
అదనపు కట్నం కూడా భారీ స్థాయిలో అడగటంతోనే తల్లిదండ్రులు ఇవ్వలేకపోయారు. దీంతో జాహ్నవి అనంత మహిళా పోలీసు స్టేషన్ను ఆశ్రయించింది. అక్కడ పంచాయితీలు ప్రారంభమై అనేక స్టేషన్లలోనూ నిర్వహించారు. ఎక్కడా సమస్య పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో బెంగళూరులో సోదరితో పాటు ఉంటున్న జాహ్నవి జీవితంపై విరక్తి చెంది న్యాయం జరగదని భావించి ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తండ్రికి 'క్షమించండి నాన్న' అంటూ, కొందరు పోలీసులకు వాయిస్ రికార్డ్ పంపినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాజకీయ, ఉన్నత స్థాయి అధికారుల ఒత్తిళ్లతోనే పోలీసులు న్యాయం చేయలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాది పాటు స్టేషన్ల చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదని వాపోయారు. జాహ్నవి ఆత్మహత్యతో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సోమవారం సాయంత్రం జాహ్నవి రెడ్డి మృతదేహాన్ని అనంతపురంకు తీసుకొచ్చారు. ఇక్కడ్నుంచి సొంతూరు వెన్నపూసపల్లికి తీసుకెళ్లి ఖననం చేశారు.