పెద్ద ఉద్యోగమని పెళ్లి, తీరా చూస్తే.. నరకం: వివాహిత కన్నీటిగాథ
Recommended Video
పశ్చిమగోదావరి: అత్తింటివారు పెట్టే అదనపు కట్నం వేధింపులు భరిస్తున్నప్పటికీ.. ఇంట్లో నుంచి బయటికి గెంటేయడంతో ఓ వివాహిత పోలీసులను, మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఈ ఘటన జిల్లాలోని గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో చోటు చేసుకుంది.
కాగా, బాధితురాలికి మద్దతుగా గురువారం వెదుళ్లకుంటలో మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. వారి మద్దతు ఆమె అత్తింటి వేధింపులకు వ్యతిరేకంగా తన కూతురుతోపాటు నిరసన కొనసాగిస్తోంది.
భారీగానే కట్నం
2015 మేలో పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు మోహనకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు. అప్పట్లో కట్నం కింద రూ 15 లక్షలు, 70 కాసులు బంగారం ఇచ్చారు. శ్రీదేవి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించడంతో తల్లి కనకదుర్గే అన్నీ చూసుకుంది.
కట్నం డబ్బు దుబారా
కాగా, పెళ్లి అయిన తర్వాత కొంతకాలం బెంగళూరులో కాపురం పెట్టారు శ్రీదేవి దంపతులు. ఈ క్రమంలో వారికి ఓ పాప పుట్టింది. కాగా, కట్నంగా ఇచ్చిన 70 కాసుల బంగారం, నగదును మోహనకృష్ణ దుబారాగా ఖర్చు చేశాడు. అంతేగాక, ఆమెను శారీకంగా హింసించేవాడు.
బెంగళూరులో పెద్ద ఉద్యోమని చెప్పి..
పెళ్లికి ముందు మోహన్కృష్ణ బెంగళూరులో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడని, అతని పేరుమీద 23 ఎకరాల పొలం ఉందని అతని తల్లిదండ్రులు చెప్పారని, కానీ, విచారిస్తే ఏ ఉద్యోగం లేదని తేలిందని శ్రీదేవి వాపోయింది. తీసుకెళ్లిన నగదు, నగలు ఖర్చయిపోవడంతో శ్రీదేవి పేరుమీద ఉన్న ఎకరం పొలం అమ్ముకుని రావాలంటూ భర్త, అత్తమామలు, ఆడపడుచు, మరిది వేధిస్తున్నారని, తనపై దాడికి పాల్పడ్డారని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. తనను ఇంట్లో ఉండనివ్వడం లేదని, దీనిపై ఉంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మహిళా సంఘాలను ఆశ్రయించినట్లు తెలిపింది.
పరారీలో అత్తింటివారు.. న్యాయం జరిగేవరకూ..
కాగా, కోడలు శ్రీదేవి మనుమరాలితో గోపాలపురం వచ్చిందని తెలుసుకున్న శ్రీదేవి అత్తమామలు ఇంటి నుంచి పరారైనట్లు తెలిపింది. దీంతో ఏమి చేయాలో తెలియక వెదుళ్లకుంట అత్తారింటికి వెళ్లే దారిలో ధర్నా చేపట్టింది. కాగా, ఆమెకు మద్దతుగా మహిళా సంఘాలు కూడా ధర్నాలో కూర్చున్నారు. శ్రీదేవికి న్యాయం జరిగే వరకు కదిలేది లేదని జిల్లా తెలుగు మహిళ అధ్యక్ష, ఉపాధ్యక్షులు గంగిరెడ్డి మేఘలాదేవి, ఆలపాటి దుర్గ్భావాని తెలిపారు. ఒక మహిళకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు స్పందించకపోవడం దారుణమన్నారు. గోపాలపురం పోలీసు స్టేషన్లో సైతం ఈ సంఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశామన్నారు. ఇటువంటి అదనపు కట్నం కోసం వేధించేవారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.