అవిభక్త కవలల స్వేచ్ఛాప్రదాత: పద్మశ్రీపై డాక్టర్ నాయుడమ్మ మనోగతం
అమరావతి: "కష్టపడి పనిచేస్తే ఫలితం... గుర్తింపు తప్పకుండా వాటంతట అవే వస్తాయి. అంతేతప్ప వెంపర్లాడాల్సిన అవసరం లేదు. ఆలస్యంగానైనా మన సేవలను అందరూ గుర్తిస్తారు. భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది'' అని ప్రముఖ డాక్టర్ యార్లగడ్డ నాయుడమ్మ అన్నారు.
అవిభక్త కవలలను విడదీయడంలో అంతర్జాతీయ ఖ్యాతి గుర్తింపు పొందిన ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తన స్నేహితులు, సన్నిహితులంతా అవార్డు చాలా ఆలస్యంగా వచ్చిందని భావిస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
పద్మశ్రీ అవార్డు మరింత ఉత్సాహంగా సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. సుదీర్ఘ వైద్య వృత్తిలో తనకు సహకరించిన కుటుంబసభ్యులకు, సాటి వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరులో నాలుగు దశాబ్దాలుగా వైద్యుడిగి సేవలందించిన నాయుడమ్మ ఉద్యోగ విరమణ చేసినప్పటికీ ఇప్పటికీ అవిభక్త కవలలకు సంబంధించిన ఆపరేషన్లకు తన వంతు సహకారం అందిస్తూనే ఉన్నారు.
ప్రకాశం జిల్లా కారంచేడులో సుబ్బారావు చౌదరి, రంగమ్మ దంపతులకు 1947లో నాయుడమ్మ జన్మించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను కారంచేడులోనే అభ్యసించారు. అనంతరం గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ (1970), హర్యానాలోని రోహతక్ మెడికల్ కాలేజీలో ఎంఎస్ (1974) పూర్తి చేశారు.
ఆ తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్లో పీడియాట్రిక్ సర్జరీ కోర్సు ఎం.సీహెచ్ (1977) పూర్తిచేసి ఢిల్లీలోని కళావతి పిల్లల ఆసుపత్రిలో రిజిస్ట్రార్గా పనిచేశారు. డాక్టర్ ఎం.ఎస్.రామకృష్ణన్తోపాటు పలువురు పెద్దలు ఆంధ్రప్రదేశ్లో పిల్లల సర్జన్లు లేరని, ఏపీకి వస్తే బాగుంటుందని సూచించడంతో 1978లో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చిన్నపిల్లల సర్జరీ విభాగాన్ని ప్రారంభించారు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల, గుంటూరు వైద్య కళాశాలల్లో 1978 నుంచి వైద్యుడిగా, అధ్యాపకుడిగా నాలుగు దశాభ్దాలపాటు సేవలు అందించారు. 2005 జూన్లో పదవీ విరమణ చేశారు. వైద్యరంగంలో సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో, అరకొర సౌకర్యాల మధ్య తలలు కలిసిపోయి జన్మించిన కవలలు రామలక్ష్మణులను విజయవంతంగా వేరుచేశారు.
దీంతో జాతీయస్థాయిలో వైద్యరంగం దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత ఛాతీ-ఉదరం కలిసి జన్మించిన కవలలు అంజలి-గీతాంజలితోపాటు పొత్తికడుపు అంటుకుపోయిన రేఖ-సురేఖలను శస్త్రచికిత్సతో విజయవంతంగా వేరుచేశారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా ఉన్న వీణా-వాణి అవిభక్త కవలలకు రెండు దశల్లో శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ నాయుడమ్మ నిర్ణయించిన సంగతి తెలిసిందే.