క్యాష్ కొట్టేశారు..ప్రీప్లాన్గా మద్యం బాటిళ్లు: పిచ్చాసుపత్రికి పంపిస్తారట: డాక్టర్ సుధాకర్
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనస్థీషియాలజిస్ట్గా పని చేస్తోన్న డాక్టర్ సుధాకర్ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు నిలువుదోపిడీకి పాల్పడ్డారని, తనను చంపడానికి ప్రయత్నించారని విమర్శించారు. తనను లారీ కిందికి తోసేయడానికి విఫలయత్నం చేశారని అన్నారు. తన చొక్కాను చింపేశారని, తాళ్లతో కట్టి మరీ బంధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
సస్పెండైన డాక్టర్ సుధాకర్కు ఏమైంది?: చొక్కా లేకుండా గుండుతో రోడ్డుపై ఇలా..
నడిరోడ్డు మీద అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ డాక్టర్ సుధాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తన వద్ద ఉన్న 10 లక్షల రూపాయలను పోలీసులు లాగేసుకున్నారని ఆయన పోలీసులపై ఆరోపణలు చేశారు. తన కారులో రెండు మద్యం బాటిళ్లను పోలీసులే పెట్టారని విమర్శించారు. తనను టీడీపీ కార్యకర్తగా సంబోధించారని అన్నారు. తనకు రాజకీయాలతో గానీ, టీడీపీతో గానీ ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినా వినిపించుకోలేదని చెప్పారు.
తనకు రోజుకు 30 సార్లు ఫోన్లు చేసిన బూతులు తిడుతున్నారని డాక్టర్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన బట్టలను చింపేశారని, డబ్బులను దోచుకున్నారని ధ్వజమెత్తారు. తాను మద్యం సేవించి, తనకు తానుగా బట్టలను చించుకున్నట్లు చెప్పారని అన్నారు. తనను లారీ కిందికి తోసేసి, ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించడానికి పోలీసులు ప్రయత్నించారని ఆయన చెప్పారు. తన కుమారుడి వాహనాన్ని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారని, అదేమని ప్రశ్నించిన తనను తీవ్రంగా కొట్టారని ఆరోపించారు.
విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్స్టేషన్ సీఐ, ఎస్ఐ తన వద్ద ఉన్న క్యాష్ను కొట్టేశారని, ఇప్పుడు వారు తనకు 10 లక్షల రూపాయలు బాకీ పడ్డారని అన్నారు. తనను పిచ్చాసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారని మండిపడ్డారు. తనను విలన్గా, టెర్రరిస్టుగా ముద్ర వేశారని చెప్పారు. మాస్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్లే తనపై పోలీసులు కక్షకట్టారని, పగ తీర్చుకుంటున్నారని ఆరోపించారు. తాను న్యాయం కోసం పోరాడానని అన్నారు.