వార్తల్లోకి డాక్టర్ సుధాకర్: కేసులో కుట్రకోణం: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు: లోతుగా సీబీఐ దర్యాప్తు
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఎనస్షీషియనిస్ట్ డాక్టర్ సుధాకర్ వ్యవహారం మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కొద్దిసేపటి కిందటే ఈ కేసుపై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో కుట్రకోణం ఉందని, దీన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ అధికారులు చేసిన విజ్ఙప్తికి ఏపీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి వీలు కల్పించింది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చేనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
Recommended Video
కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందంటూ..
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు వ్యవహారం ఎంత వరకు వచ్చిందనే విషయంపై ఏపీ హైకోర్టు సోమవారం ఆరా తీసింది. డాక్టర్ సుధాకర్ను అరెస్టు చేయడం, ఆయనపై విష ప్రయోగం జరిగిందంటూ వచ్చిన వార్తలపై హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎనిమిది వారల్లోగా విచారణను పూర్తి చేయాలని, సమగ్ర నివేదికను అందజేయాలంటూ గడవు విధించింది. ఈ నేపథ్యంలో కేసు పురోగతిపై హైకోర్టు ఆరా తీసింది. దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందో వివరించాలంటూ అధికారులను ఆదేశించింది.
కుట్ర కోణం ఉందంటూ..
నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందనే విషయాన్ని సీబీఐ అధికారులు హైకోర్టుకు వివరించారు. ఈ కుట్రకోణాన్ని ఛేదించడానికి మరి కొంత సమయం అవసరం అవుతుందని చెప్పారు. తమకు మరో నెలరోజుల పాటు గడువు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు. ఇప్పటిదాకా చేపట్టిన దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఓ నివేదికను న్యాయస్థానానికి అందించారు. తమకు గడువు కావాలంటూ సీబీఐ అధికారులు చేసిన వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. గడువు ఇవ్వడానికి అంగీకరించింది. వచ్చేనెల 11వ తేదీ నాటికి సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణనను వచ్చేనెల 16వ తేదీకి వాయిదా వేసింది.
మాస్కులు.. పీపీఈ కిట్లు లేవంటూ..
కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లకు ప్రభుత్వం ఎన్ 95 మాస్కులు గానీ, పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్లను గానీ అందించట్లేదంటూ ఇదివరకు డాక్టర్ సుధాకర్ విమర్శించిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. కొద్దిరోజుల తరువాత ఆయన నడిరోడ్డు మీద కనిపించారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. సుధాకర్ మానసిక పరిస్థితి బాగాలేదంటూ విశాఖపట్నం మానసిక వైద్య ఆసుపత్రికి తరలించారు.
వంగలపూడి అనిత లేఖతో..
అక్కడ ఆయనపై సరైన రీతిలో చికిత్స అందించట్లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా.. ఏపీ హైకోర్టు డాక్టర్ను తప్పించింది. మరో కొత్త డాక్టర్కు డాక్టర్ సుధాకర్కు చికిత్స అందించే బాధ్యతలను అప్పగించింది. ఆ తరువాత.. డాక్టర్ సుధాకర్పై విష ప్రయోగం జరుగుతోందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడం, అదే సమయంలో ఈ కేసుపై విచారణ చేపట్టాలంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీనితో ఏపీ హైకోర్టు.. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఎనిమిది వారాల్లోగా దర్యాప్తు ముగించాలంటూ గడువు విధించింది.