నిమ్మగడ్డకు తాత్కాలిక ఉపశమనం.. ఇక హైకోర్టుకు డాక్టర్ సుధాకర్..! అదే జరగనుందా..?
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూల్చేసి భవిష్యత్తులో తన పంథా ఎలా ఉండబోతుందనన్న ఉద్దేశాన్ని ఏపి ప్రజలకు చెప్పకనే చెప్పుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ ముద్రను పూర్తిగా చెరిపేసేందుకు వైసీపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నీ కావు. ఇదే క్రమంలో ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులను ప్రతిపక్షాలు ఎండగడుతున్నా అంతగా పట్టించుకోని ప్రభుత్వానికి అవే అంశాల పట్ల కోర్టు నుండి వెలువడుతున్న తీర్పులు శరాఘాతంగా పరిణమిస్తున్నాయి.
నిమ్మగడ్డ తీర్పుపై స్పందించిన పవన్.! ప్రజాస్వామ్యానికి కోర్టు తీర్పు ఊపిరి పోసిందన్న జనసేనాని.!
నిమ్మగడ్డ కేసులో కోర్ట్ అనూహ్య తీర్పు.. ప్రభుత్వ మద్యంతర ఉత్తర్వులు చెల్లవన్న ఏపీ హైకోర్ట్..
అమరావతిలో వివాదాస్పద రీతిలో పదవి నుంచి తప్పించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. రమేష్ కుమార్ ను తొలగించడం కోసమే సృష్టించిన కొత్త ఆర్డినెన్సు, సంబంధిత జీవోలను హైకోర్టు శుక్రవారం కొట్టి వేసింది. అవన్నీ చెల్లవని పేర్కొంది. వెంటనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల ప్రధాన అధికారిగా విధుల్లోకి తిరిగి నియమించాలని ఆదేశించింది ఏపి హైకోర్ట్. రమేష్ కుమార్ను తప్పించడం కోసం జారీ చేసిన ఆర్డినెన్స్, ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్న కోర్ట్.. ఏపి ప్రభుత్వానికి వరస షాక్ లు..
వెంటనే రమేశ్ కుమార్ను తిరిగి కమిషనర్గా నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను తొలగించాలన్న దురుద్దేశంతోనే ఆర్డినెన్స్ తెచ్చారన్న రమేష్ కుమార్ వాదనల్లో నిజం ఉందని కోర్టు విశ్వాసం వ్యక్తం చేసింది. దానికి తగిన సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో ఆర్డినెన్స్, సంబంధిత జీవోలపై దాఖలైన వ్యాజ్యాలను ఉన్నత న్యాయస్థానం విచారించి ఈ సంలచన తీర్పు వెలువరించింది. కాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ కూడా ఏపి హైకోర్ట్ ను ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా ప్రభుత్వ చర్యలకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్న నేపథ్యంలో కోర్ట్ తీర్పు ఎలా ఉండబోతుందన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కోర్ట్ మెట్లెక్కిన డాక్టర్ సుధాకర్.. ప్రభుత్వం పై ఫిర్యాదు చేసిన వైద్యుడు..
అంతే కాకుండా బాధ్యతగా తను పనిచేస్తున్న ఆస్పత్రికి అవసరమైన కిట్లు, పరికరాల కోసం మీడియా ద్వారా ప్రశ్నించినందుకు తనను ప్రభుత్వం టార్గెట్ చేసిందని డాక్టర్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ వాదనతో ఏకీభవించిన హైకోర్ట్ అతని కేసును ఏకంగా సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం స్వయంగా డాక్టరు సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ మానసిక ఆసుపత్రిలో తనకు అవసరం లేని వైద్యం చేసి, అవసరం లేని డ్రగ్స్ అందిస్తూ తనను రోగిలా చిత్రీకరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. తనకు సరైన వైద్యం అందడం లేదని వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని డాక్టర్ సుధాకర్ కోర్టుకు తెలిపారు.
Recommended Video
పిచ్చిలేకున్నా పిచ్చివాడిగా చిత్రీకరిస్తున్నారు.. న్యాయం చేయాలని కోర్టుకు సుధాకర్ విజ్ఞప్తి..
తాను సాధారణ జీవనం గడపాలంటే కోర్టు పర్యవేక్షణలో చికిత్స జరగాలని డాక్టర్ సుధాకర్ కోర్టుకు విజ్జప్తి చేశారు. సుధాకర్ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టుకు పలు విజ్జప్తులు చేశారు. సుధాకర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, కేవలం పోలీసులు కొట్టిన దెబ్బలకు మాత్రమే ఇపుడు వైద్యం అవసరమని హైకోర్టుకు విజ్ఞప్తి చేసారు. మానసిక వ్యాధి లేని సుధాకర్ కు మానసిక వ్యాధికి ఇచ్చే మాత్రలు ఇచ్చారని వాటి వివరాలను కోర్టుకు తెలిపారు. అతడి మీద పిచ్చోడని ముద్ర వేయడానికి ప్రభుత్వ ప్రయత్నం చేస్తోందని, దీనికి అతనికి ఇస్తున్న మందులే సాక్ష్యం అని ఆయన తెలిపారు. డాక్టర్ సుధాకర్ ను మానసిక ఆస్పత్రికి తరలించడంలోనే ప్రభుత్వ కుట్ర ఉందనే సందేహాలు కలుగుతున్నాయని న్యాయవాది శ్రావణ్ కుమార్ వివరించారు. ఈ నేపథ్యంలోనే కోర్ట్ తీర్పు పట్ల ఉత్కంఠ నెలకొంది.