బడ్జెట్: నిన్న బాబు, నేడు పవన్ కళ్యాణ్ దెబ్బకు దిగొచ్చిన నరేంద్ర మోడీ?
Recommended Video
విశాఖ: కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, వైసీపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు భగ్గుమంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కూడా అసంతృప్తితో ఉంది. విపక్షాలు భగ్గుమంటున్నాయి.
ఏంటిది!: బడ్జెట్పై బాబు తీవ్ర అసంతృప్తి, త్యాగానికి సిద్ధమని సుజనా, 'చాలా దుర్మార్గం'
మరోవైపు, రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు బడ్జెట్ బాగుందని చెబుతున్నారు. దేశ ప్రజల కోసం, రైతుల కోసం, గ్రామీణులను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశ పెట్టారని చెబుతున్నారు. బడ్జెట్లో తప్పుబట్టేందుకు ఏమీ లేదంటున్నారు. సామాన్యులకు అనుకూలమైన బడ్జెట్ అని చెబుతున్నారు. ఇతర పార్టీలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే బడ్జెట్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు.
పవన్ ప్రశ్నిస్తే దిగొచ్చిన కేంద్రం!
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే చంద్రబాబు ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దిగివచ్చిందని అంటున్నారు. అమరావతి రాజధాని భూమి మొదలు అన్ని అంశాలపై పవన్ ప్రశ్నిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిపై అనుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేంద్రం కూడా పవన్ దెబ్బకు దిగి వచ్చిందని చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ తూటా పేలిందంటూ
విశాఖలోని డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు 2018-19 బడ్జెట్లో కేంద్రం రూ.19.62 కోట్లు కేటాయించింది. దీనిపై సోషల్ మీడియాలో కౌంటర్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తూటా బడ్జెట్లో పేలిందని అభిమానులు చెబుతున్నారు.
అండగా నిలబడిన పవన్ కళ్యాణ్
డ్రెడ్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను ప్రయివేటుపరం చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోందని ఇటీవల ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందే. వారికి పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ప్రయివేటుపరం ఆలోచనలపై ఆయన కేంద్రాన్ని నిలదీయడంతో పాటు, అడ్డుకోవాలని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వానికి సూచన చేశారు.
జనసేన ఎఫెక్ట్
డ్రెడ్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాను (డీసీఐ) ప్రయివేటుపరం చేయాలనే ఆలోచనలో ఉన్న కేంద్రం ఇప్పుడు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు కేటాయించడంతో ప్రయివేటుపరం ఆలోచనను తాత్కాలికంగా వేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ప్రభావమే అని అభిమానులు అంటున్నారు.
లాభాల్లో ఉన్న సంస్థ అంటూ పవన్ నిలదీత
డీసీఐ లాభాల్లో ఉంది. ఇలాంటి సంస్థను ప్రయివేటుపరం చేయాలని కేంద్రం భావిస్తోందంటూ ఉద్యోగులు నిరసన తెలియజేయటంతో పవన్ అక్కడకు వెళ్లి వారికి మద్దతు తెలిపారు. లాభాల్లో ఉన్న సంస్థను ప్రయివేటుపరం చేయాలనే ఆలోచన ఏమిటంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఆయన స్థానిక ఎంపీ, బీజేపీ నేత హరిబాబుకు అల్టిమేటం కూడా జారీ చేశారు. నేరుగా ప్రధాని మోడీకి డీసీఐ ఉద్యోగుల ఆవేదనను చెబుతూ లేఖ రాశారు. వీటిపై స్పందన లేకున్నప్పటికీ.. బడ్జెట్లో కేటాయింపులు జరపడం మాత్రం పవన్ ఎఫెక్ట్ అంటున్నారు.