ఎలక్ట్రిక్ స్టవ్ల్లో బంగారం స్మగ్లింగ్...విలువెంతో తెలుసా...రూ.2 కోట్లు పైనే
నెల్లూరు: ఒక ప్రయాణికుడు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు ముందుగా అందిన సమాచారం మేరకు నెల్లూరులో రైల్వే స్టేషన్ లో డీఆర్ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు ఆ ప్యాసింజర్ కమ్ స్మగ్లర్ కోసం గాలిస్తున్నారు. తమకు వచ్చిన సమాచారం ప్రకారం ఎట్టకేలకు సదరు వ్యక్తిని అధికారులు గుర్తించ గలిగారు. అయితే అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేసినా బంగారం దొరకకపోవడంతో పొరపాటు పడ్డామా అనే డైలమాలో పడ్డారు...కానీ వచ్చిన సమాచారం విశ్వసనీయమైంది కావడంతో మరోసారి అతడిని సోదా చేశారు...ఆ తరువాత...
అనుమానితుడి వద్ద ఉంది రెండు ఎలక్ట్రిక్ స్టవ్లు మాత్రమే వాటిని అటూ ఇటూ కదిలించి చూసినా ఏమీ కనిపించలేదు...అయితే తమకు ఉన్న ఇన్ఫర్మేషన్ మీద నమ్మకంతో ఆ స్టవ్లను మరింత తేరిపారా పరిశీలించారు. అవి సాధారణ స్టవ్ ల కంటే కొంచెం బరువు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపించడంతో ఇక వాటిని విప్పతీయాలని నిర్ణయించారు...అంతే...అవి విడిపోవడం...స్మగ్లర్ గుట్టు రట్టు అవడం ఒకేసారి జరిగి పోయాయి...ఇంతకీ ఆ స్టవ్ లలో స్మగ్లర్ దాచుకొచ్చిన బంగారం బరువెంతో తెలుసా?...4 కిలోల 658 గ్రాములు...దాని ఖరీదెందో ఊహించగలరా?...అక్షరాలా ఒక కోటి 43 లక్షల రూపాయలు... స్మగ్లింగా...మజాకా?...
నెల్లూరు రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను డీఆర్ఐ ఉన్నతాధికారులు సోమవారం మీడియాకు విడుదల చేశారు....ఆ వివరాల ప్రకారం...గువహటి ఎక్స్ప్రెస్లో ఓ ప్రయాణికుడు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నాడని హైదరాబాద్ డీఆర్ఐకు సమాచారం వచ్చింది. వాళ్లు వెంటనే విజయవాడ జోనల్ అధికారులను అప్రమత్తం చేశారు. విజయవాడ అధికారులు వెంటనే నెల్లూరు స్టేషన్కు చేరుకుని రైలును ఆపి సదరు ప్రయాణికుడిని తనిఖీలు చేశారు. పర్పుల్ కలర్ బ్యాగ్లో రెండు ఎలక్ట్రిక్ స్టవ్లను గుర్తించారు. ముందుగా అతడిని సోదా చేస్తే ఏమీ దొరకక పోవడంతో అతడి దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్లను మీద అనుమానం వచ్చి సుత్తి, స్కూడ్రైవర్ లాంటి పరికరాలు తీసుకుని వాటి భాగాలను వేరు చేశారు...
ఇంకేముంది అందులో జాగ్రత్తగా దాచిపెట్టిన స్వచ్ఛమైన బంగారం బైటపడింది. అల్యూమినియం స్టవ్లలో అతడు బంగారాన్ని అమర్చిన విధానం చూసి ఆశ్చర్యపోయిన అధికారులు ఆ బంగారాన్ని తూకం వేసి చూశారు. రెండు స్టవ్లలో అమర్చిన మొత్తం బంగారం కలిపి 4658 గ్రాములు ఉంది. దాని విలువ రూ. 1, 43,00 063 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. స్మగ్లింగ్కు పాల్పడిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కస్టమ్స్ యాక్ట్ 1962 కింద ఆ బంగారాన్ని సీజ్ చేశామని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు ఒడిషాలోని ఖుర్దా రైల్వే స్టేషన్లో కూడా ఇలాగే బంగారం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ ప్రయాణికుడి నుంచి 15 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు మరో ప్రెస్నోట్లో పేర్కొన్నారు. దాని విలువ రూ. 70 లక్షలు ఉండొచ్చని అంచనా వేశారు. ఆ బంగారు బిస్కట్లపై మయన్మార్ మార్కింగ్స్ ఉన్నట్లు గమనించామని, నెల్లూరులో పట్టుబడిన బంగారం కూడా మయన్మార్ నుంచే వచ్చినట్లు అనుమానిస్తున్నామని, ఈ రెండు కేసులపై పూర్తి విచారణ చేస్తున్నామని డీఆర్ఐ అధికారులు తెలిపారు. మొత్తం మీద ఒకే రోజు రూ.2 కోట్ల పైన బంగారం పట్టుబడటం గమనార్హం