తాగుబోతుల వీరంగం: ప్రశ్నించిన పోలీసులపై దాడి
హైదరాబాద్: యాచారం మండల పరిధిలోని మాల్ మార్కెట్లో కొంతమంది తాగుబోతులు వీరంగం సృస్టించారు. అంతేగాక, ప్రశ్నించిన పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. మాల్మార్కెట్లో అర్ధరాత్రి బహిరంగ ప్రదేశంలో కొంతమంది మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న చింతపల్లి, యాచారం మండల పోలీసులు వారిని మందలించారు. దీంతో వారు పోలీసులపై తిరుగబడి దాడి చేశారు.
ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. 18 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతపల్లి పోలీస్స్టేషన్ ఎస్సై రాఘవేందర్రెడ్డి తెలిపారు.
హాస్టల్ విద్యార్థులను చితకబాదిన పోలీసులు
హైదరాబాద్: భోజనం బాగోలేదని ఆందోళన చేస్తున్న హాస్టల్ విద్యార్థులను పోలీసులు చితకబాదారు. ఈ ఘటన నగరంలోని వనస్థలిపురంలోని ఎన్ఆర్ఐ కళాశాలలో చోటుచేసుకుంది. భోజనం బాగలేదని విద్యార్థులు నిరసనకు దిగారు.
విద్యార్థులకు సర్ధిచెప్పి సమాధానపరచాల్సిన కళాశాల యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యాజమాన్యం సూచనల మేరకు విద్యార్థులను చితకబాదారు. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
నిజామాబాద్: బోధన్ మండలం ఊటుపల్లిలో గోవింద్ అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడిలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రైతును చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రైతు పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా ఎలుగుబంటి దాడి చేసింది.