నిద్రమత్తులో డ్రైవర్ .. కాలువలోకి దూసుకెళ్లిన కావేరీ ట్రావెల్స్ బస్సు
మితిమీరిన వేగంతో నడిపే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతి వేగం ప్రమాదకరమని ఎన్నిసార్లు చెప్పిన డ్రైవర్ల నిర్లక్ష్యం ఎంతో మంది ప్రయాణికులు ప్రాణాలు తీస్తుంది. ఇక అంతే కాదు బస్సులు నడుపుతున్న డ్రైవర్లు జాగ్రత్తగా ఉండక పోవడం, నిద్ర పోవడం వంటి కారణాలు తరచు రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. తాజాగా ఒక ప్రైవేటు ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటన సోమవారం తెల్లవారుజామున తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే పెద్దపూడి వద్ద చోటు చేసుకుంది.
నదిలో బోల్తా పడిన ఓం సాయి ట్రావెల్స్ బస్సు: ఆరుమంది గల్లంతు
కావేరి ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు పంట కాలవ లోకి దూసుకెళ్లింది. ప్రయాణికులతో హైదరాబాద్ నుండి అమలాపురం వెళుతుండగా జరిగిన ఈ ఘటనలో బస్సు ముందు భాగం కాలువలోకి దిగిపో గా వెనుక భాగం గాలిలోకి పైకి లేచింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హాహాకారాలు చేశారు. ఎక్కడ బోల్తా కొడుతుందో అని భయపడ్డారు. స్థానికుల సహాయంతో ప్రయాణికులకు ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా బయట పడ్డారు. అయితే బస్సు నడుపుతున్న డ్రైవర్ మంచి వేగంతోనూ, నిద్ర మత్తులోనూ ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, బస్సు కాలువలోకి దూసుకుపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రావెల్స్ సిబ్బంది బస్సు నెంబర్ ప్లేట్ పై మట్టి పూసి నంబర్లు కనిపించకుండా చేసే ప్రయత్నం చేశారని ప్రయాణికుల ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా ఎవరికీ ప్రాణ హాని జరగకున్నా ప్రమాదం మాత్రం సంభవించింది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి ప్రైవేటు ట్రావెల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా, ప్రయాణికుల భద్రత గాల్లో దీపంగానే మారిందని ఇలాంటి ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి.