మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై కస్సుమన్న ద్రోణంరాజు శ్రీనివాస్..ఇద్దరూ వైసీపీ నేతలే..ఎందుకిలా?
విశాఖపట్నంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కు, వి ఎం ఆర్ డి ఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తున్న సందర్భంగా నగరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్ లో మంత్రి అవంతి శ్రీనివాస్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ గురించి చేసిన వ్యాఖ్యలు స్వల్ప వాగ్వాదానికి దారితీశాయి.ఇద్దరూ వైసీపీ నేతలే కావటంతో అక్కడ వారి మధ్య జరిగిన వాగ్వాదం ఆసక్తికర చర్చకు కారణం అయ్యింది.
గ్రామ సచివాలయ ఉద్యోగులు అందరూ గ్రామంలోని ప్రజలకు సేవ చేసే విధంగా ఉండాలని, మెరుగైన సేవలను అందించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. సిటీలో పెరిగిన ద్రోణంరాజుకు గ్రామాల్లోని పరిస్థితులు పెద్దగా తెలియవని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.ఇక సభా వేదికగా మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు కస్సుమన్న ద్రోణంరాజు వెంటనే కౌంటర్ ఇచ్చారు. తానూ గ్రామీనప్రాంతంలోనే పుట్టానన్నారు ,మంత్రి అవంతి శ్రీనివాస్ చిన్నా పెద్దా తేడా తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. అంతేకాదు తాము కూడా గ్రామస్థాయి నుంచి వచ్చామని, మంత్రి వ్యాఖ్యలు సరికావని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తన తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ గ్రామ కరణంగానూ, సర్పంచ్ గారు పనిచేశారని ఇక ఆ తరువాత ఒక ఎమ్మెల్యే గానూ, ఎంపీ గానూ సేవలందించారని వివరించారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంత వ్యక్తులతో తమకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్న ద్రోణంరాజు శ్రీనివాస్, మంత్రి అవంతి శ్రీనివాస్ సభా మర్యాదను పాటించాలని హితవు పలికారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు పదవి ఇచ్చారని, ఇక వలసదారులకు ఎవరికైనా తన పదవి కావాలంటే దీన్ని కూడా ఇచ్చేస్తానని ఆయన మండిపడ్డారు. ఇక మాట్లాడే ముందు చిన్న పెద్ద తేడా తెలుసుకుని మాట్లాడితే మంచిదని కాస్త ఘాటుగానే స్పందించారు. ఇక ద్రోణంరాజు మాటలకు, మంత్రి అవంతి శ్రీనివాస్ తన మాటలను ద్రోణంరాజు అపార్థం చేసుకున్నాడు అని వివరణ ఇచ్చారు.