డ్రగ్స్ కేసు నిందితుడు వైసీపీనేత బినామీ.. బిగ్ బాస్, ఉత్తరాంధ్ర బందిపోటుకు అంతా తెలుసన్న బుద్దా వెంకన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. రాష్ట్రంలో తాజాగా డ్రగ్స్ స్మగ్లింగ్ అంశం రాజకీయ రగడకు కారణమైంది. ఏపీలో డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారని టీడీపీ, టీడీపీ నేతలు పరిషత్ ఎన్నికల్లో ఓడిపోయి, ఓటమి బాధతో ఉన్మాదంతో మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
సీఎం జగన్ ను, డ్రగ్స్ ఆదానీ గ్రూప్ నిర్వహిస్తున్న పోర్ట్ లో దొరకటంతో ఆదానీని, జగన్ తో సన్నిహితంగా ఉంటారంటూ అదానీపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు ఏపీకి చెందిన వ్యక్తి కావటంతో అతని వెనుక అధికార వైసీపీ ఉందంటూ పెద్ద ఎత్తున రచ్చ కొనసాగుతుంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతోఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంది.
డ్రగ్స్ మాఫియా వెనుక ఉంది వైకాపాబన్లు
ఏపీ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ మాఫియా సాగుతోందని టిడిపినేతలు వైసీపీని టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోమారు మాటల దాడిని పెంచుతూ టీడీపీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ నుండి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు అక్రమ రవాణా జరుగుతూ పట్టుబడిన హెరాయిన్ రవాణా షిప్ మెంట్ పై విజయవాడ అడ్రస్ ఉండడంతో ఇక ఈ రగడ పీక్స్ కు చేరుకుంది. వైసీపీ ప్రభుత్వానికి హెరాయిన్ లింకులు ఉన్నట్లుగా టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియా వెనుక ఉంది వైకాపాబన్లు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సుధాకర్ కాకినాడ వైసీపీ నాయకుడికి బినామీ
తాజాగా టిడిపి నేత బుద్దా వెంకన్న గుజరాత్ లో ముంద్రా పోర్టులో పట్టుబడిన 21 కోట్ల హెరాయిన్ పై వైసీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాలో పట్టుబడిన సుధాకర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని, కాకినాడకు చెందిన వైసీపీ నాయకుడికి బినామీ అని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ విషయం కాకినాడ ప్రజలందరికీ తెలుసని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ మాఫియాతో వైసీపీ కి సంబంధం లేకపోతే వెంటనే ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.
డ్రగ్స్ తాడేపల్లి ప్యాలెస్లో దాచారా ? లేక ఉత్తరాంధ్ర బందిపోటు దగ్గర ఉంచారా?
72వేల కోట్ల హెరాయిన్, డ్రగ్స్ తాడేపల్లి ప్యాలెస్లో దాచారా ? లేక ఉత్తరాంధ్ర బందిపోటు దగ్గర ఉందా చెప్పాలని, ఏ వన్, ఏ టూ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఎంపీ విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేశారు బుద్దా వెంకన్న. హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నారని, మత్తు కోసం చీప్ లిక్కర్ తయారు చేస్తూ లిక్కర్ మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నుల్లోనే జరుగుతోంది అని బుద్దా వెంకన్న ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని సంఘవిద్రోహ శక్తులకు పంపిస్తున్నారని, ప్రస్తుతం దేశం ఏపీ వైపు దృష్టి సారించడం వెనుక మత్తుపదార్థాల మాఫియా ఉందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
తాలిబన్ రాజ్యం నుండి తాడేపల్లికి డ్రగ్స్ స్మగ్లింగ్ పై సమాధానం చెప్పాలి
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో 72వేల కోట్ల డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంటే ఇంటిలిజెన్స్ కు తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా సిఎం ఇంటి పక్కనే డ్రగ్స్ దందా జరుగుతుందా అని ప్రశ్నించారు. తాలిబన్ రాజ్యం నుండి తాడేపల్లికి జరుగుతున్న డ్రగ్స్ స్మగ్లింగ్ పై ప్రజలకు సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న నిలదీశారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద భక్తులు సమర్పించిన తలనీలాలు మయన్మార్ వంటి దేశాలకు అక్రమంగా తరలిస్తూ పట్టుబడలేదా అని ప్రశ్నించిన బుద్దా వెంకన్న, ఇప్పుడు కూడా అదే తరహాలో ఇతర దేశాల నుండి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి అంటూ నిప్పులు చెరిగారు.
డ్రగ్స్ మాఫియాపై సీబీఐ విచారణ జరిపించాలి
రాష్ట్రంలో డ్రగ్స్ దందా జోరుగా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకుని ఎందుకుంటుందో చెప్పాలని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. సీఎం ఇంటి సమీపంలో నిత్యం గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందని, యువత విచ్చలవిడిగా మత్తులో జోగుతోందని, అయినప్పటికీ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రస్తుత ఈ పరిణామాలకు కారణం ఉత్తరాంధ్ర బందిపోటు, అలాగే రాష్ట్రానికి బిగ్ బాస్ అంటూ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంటి పై దాడి చేసిన జోగి రమేష్ వ్యవహారంలో ఆయన నిర్దోషి అని వైసీపీ ఎమ్మెల్యేను వెనకేసుకు వచ్చి మాట్లాడిన పోలీసులు, రాష్ట్రంలో డ్రగ్స్ దందా పై ఎందుకు నోరు విప్పడం లేదని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పాత్ర లేకపోతే ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ కోరాలని, లేదంటే కేంద్రం కలుగజేసుకొని ఏపీ డ్రగ్స్ వ్యవహారంలో సిబిఐ విచారణ జరిపించాలని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.
డ్రగ్స్ కేసు నిందితులకు వైసీపీ నాయకులతో సంబంధాలు
డ్రగ్స్ కేసులో వైసీపీ ఎందుకు ఉలికి పడుతుందని, ఇంతా జరుగుతుంటే ప్రభుత్వం దీని మీద ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. ఆఫ్ఘనిస్తాన్ నుండి భారత్ లోకి ప్రవేశించిన భారీ హెరాయిన్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాచవరం సుధాకర్ ఆయన భార్య వైశాలి కీలక నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే వారిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకుని వారి నుంచి వివరాలను సేకరిస్తున్నారు.అయితే నిందితుడికి వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ వైసీపీ నాయకుడు ఎవరు అన్న చర్చ జోరుగా సాగుతుంది.