ఆగస్టులో డీఎస్సీ-2018:ఏపీపీఎస్సీకి నిర్వహణ బాధ్యతలు
విశాఖపట్టణం:రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల సందడి మొదలైంది. రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే డిఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ ప్రకటించారు.
శనివారం విశాఖపట్టణంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన డిఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ వివరాలు వెల్లడించారు. ఆగస్టు 24 నుంచి 26 వరకు ఆన్లైన్లో ఈ డీఎస్సీ-2018 పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖా మంత్రి తెలిపారు. ఈసారి పరీక్షల నిర్వహణను ఏపీపీఎస్సీకి అప్పజెప్పినట్లు మంత్రి చెప్పారు.
ఆర్థిక శాఖ...ఆమోదం కోసం...
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపడం జరిగిందని, అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీపీఎస్సీ అధికారికంగా షెడ్యూల్ను ప్రకటిస్తుందని మంత్రి గంటా వివరించారు. ఈ పరీక్షలు ఆన్లైన్లోనే ఉంటాయన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి సర్కారు ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీల వివరాలను సేకరించింది. 2014 జూన్ 1 నుంచి 2018 మార్చి 31 వరకు ఉన్న ఖాళీలను ఆగస్టులో నిర్వహించబోయే డీఎస్సీ-2018 ద్వారా భర్తీ చేయనున్నారు.
తొలిసారిగా...ఆ పోస్టుల భర్తీ
మున్సిపల్, మోడల్ పాఠశాలల్లో ఖాళీలతో పాటు గతంలో కొన్ని పోస్టులను అప్గ్రేడ్ చేయడం ద్వారా ఏర్పడిన కొత్త ఖాళీలను వేరుగా చూపించడం జరిగిందన్నారు. వీటినీ జిల్లాల వారీగా విభజించి త్వరలోనే అధికారిక డీఎస్సీ ప్రకటనలో పూర్తిస్థాయిలో ఖాళీలను చూపించే అవకాశం ఉంది. అలాగే పిల్లలకు సంగీతం, నృత్యం నేర్పించడానికి వీలుగా ఆయా పోస్టులను కూడా తొలిసారిగా భర్తీచేస్తున్నట్లు గుర్తుచేశారు. ఈసారి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ముఖ్యమంత్రి నేరుగా సమీక్షించి ఉపాధ్యాయ వృత్తిలో అంకితభావాన్ని తెలియజేసేలా ప్రతిజ్ఞ చేయిస్తారని చెప్పారు. జిల్లాల వారీగా జడ్పీ, ఎంపీపీ, ప్రభుత్వ పాఠశాలల విభాగాల్లో ఖాళీల వివరాలు ఇవి...
టెట్-2 కు...3,97,957 మంది..
ఆదివారం నుంచి ఈనెల 19 వరకు జరగనున్నటెట్-2 కు 3,97,957 మంది దరఖాస్తు చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో మొత్తం 113 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 14,891 మంది కేంద్రాలు ఎక్కడ కావాలో ఆప్షన్ పెట్టుకోలేదు. వీరికి సమీప కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామని మంత్రి పేర్కొన్నారు. టెట్ పరీక్షను రెండు విడతలుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్కో విడతలో 27,495 మందికి అవకాశం ఉందని, ఇలా రోజుకు 54,990 మంది పరీక్షలు రాస్తారని గంటా వివరించారు. సందేహాల నివృత్తి కోసం 95056 19127, 95057 80616, 95058 53627 నంబర్లు హెల్ప్లైన్ కోసం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ టెట్ ఫలితాలు...వెంటనే
ఈ సారి టెట్ ఫలితాలను ఆన్లైన్లో వెంటనే తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు మంత్రి గంటా చెప్పారు. పరీక్ష పూర్తయ్యాక సబ్మిట్ బటన్ నొక్కగానే ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుందన్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి మూడో తేదీ వరకు మొదటిసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించిన సంగతి తెలిసిందే. దానికి 4.46 లక్షల మంది ధరఖాస్తు చేసుకుంటే 4.10 లక్షల మంది పరీక్షలు రాశారు. డీఎస్సీ 2018లో ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం మరోసారి టెట్ నిర్వహిస్తోంది.
ఇకపై... జిల్లాకు ఇద్దరు డీఈవోలు
విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు వీలుగా జిల్లాకు ఇద్దరు డీఈవోలను నియమించనున్నట్లు మంత్రి గంటా తెలిపారు. డీఎస్సీ- 2014 ద్వారా పది వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఈ ఏడాది మరో పది వేలు పోస్టులను భర్తీ చేసి రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలోని పాఠశాలలన్నింటిలో మౌలిక వసతుల కోసం ఈ ఏడాది రూ.4,850 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతామని, ముందు ముందు ఏ గవర్నమెంట్ స్కూల్ లోనూ చెట్ల కింద తరగతలు నిర్వహించే పరిస్థితి, నేలపై విద్యార్థులు కూర్చొనే దుస్థితి ఉండదన్నారు.