'సెప్టెంబర్ 5న డిఎస్సీ నోటిఫికేషన్, రుణమాఫీ చేస్తాం'
కుప్పం: సోమవారం కుప్పంలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం పాఠశాలల పనితీరు కార్పోరేట్ పాఠశాలలకు మించి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్దులు, ఉపాధ్యాయులు స్కూలుకి హాజరవుతున్న విషయాన్ని ఖచ్చితంగా పర్వవేక్షించడానికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈ బయోమెట్రిక్ విధానాన్ని మొదటగా పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. వీడియో, ఆడియో ద్వారా పాఠ్యాంశాల బోధిస్తామన్నారు. ప్రతి 10 గ్రామాలకు ఒక క్లస్టర్ స్కూల్ ను ఎంపిక చేసి ఆ పాఠశాలలో విద్యకు సంబంధించిన అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో కొత్తగా 17 విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపామన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ లో ఎక్కువ మొత్తం విద్యకే కేటాయిస్తామన్నారు. రైతులకు, డ్వాక్రా సంఘాలకు కచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామన్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 2 నుండి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం క్రింద రూ. 2కే 20 లీటర్ల త్రాగునీటిని అందించనున్నట్లు తెలిపారు.