ఏపీలో కరోనా విజృంభణ - నెల్లూరు, విశాఖలో షాపింగ్ వేళల తగ్గింపు- కొత్త టైమింగ్స్ ఇవే..
ఏపీలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇవాళ తాజా హెల్త్ బులిటెన్ ప్రకటించే సమయానికి ఏపీలో మొత్తం 143 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు, అనుమానితులు పెరుగుతున్న విశాఖ, నెల్లూరు జిల్లాల్లో రేపటి నుంచి ఉదయం నిత్యావసర వస్తువుల షాపింగ్ సమయాలు మరోసారి తగ్గాయి. దీనిప్రకారం ఉదయం 6 నుంచి 9 గంటల వరకూ మాత్రమే ప్రజలకు బయటికి వచ్చేందుకు అనుమతిస్తారు.
నెల్లూరు, విశాఖలో షాపింగ్ సమయాల కుదింపు..
ఏపీలోని వివిధ జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. తాజాగా పెరుగుతున్న కేసులు, అనుమానితుల సంఖ్య, ప్రజల స్పందన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల వారీగా లాక్ డౌన్ మినహాయింపు సమయాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రకటించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో తాజాగా నెల్లూరు, విశాఖ జిల్లాల్లో కలెక్టర్లు తమ విచక్షణ మేరకు ఆయా జిల్లాల్లో పరిస్ధితిని సమీక్షించి నిత్యావసర వస్తువుల షాపింగ్ సమయాలను తగ్గించాలని నిర్ణయించారు. దీంతో రేపటి నుంచి ఈ రెండు జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే షాపింగ్ కు అనుమతిస్తారు.
నెల్లూరు, విశాఖలో కుదింపు ఎందుకంటే..
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిత్యావసర వస్తువులు కొనుక్కొనేందుకు అనుమతి ఇస్తున్నారు. కానీ తాజాగా నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి ఆచూకీ పూర్తిగా లభించకపోవడం, ఇతరత్రా కారణాలతో లాక్ డౌన్ మరింత పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లు నిర్ణయించారు. ఈ మేరకు సమయాలు కుదిస్తున్నట్లు వారు ఇవాళ ప్రకటించారు. పరిస్ధితిని బట్టి షాపింగ్ వేళలపై సమీక్ష ఉంటుందని కలెక్టర్లు తెలిపారు.