108 టు 104: కరోనా పేషంట్ను కనికరించని సిబ్బంది, అంబులెన్స్ రాక మృతి, వీడియో ట్వీట్ చేసిన లోకేశ్
వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 104, 108 సర్వీస్ సిబ్బంది ఓ రోగి ప్రాణం తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే వందల కోట్లతో అంబులెన్సులను ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజుల్లోనే కరోనా వైరస్ సోకిన రోగి చనిపోయారు. ఆ మృతుడి భార్య బాధను లోకేశ్ ట్వీట్ చేశారు. 108 సిబ్బంది ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. రోగి మరణానికి కారకులు ఎవరూ అని ఓ రేంజ్లో ఫైరయ్యారు.
కరోనాను ఎవరూ ఆపలేరు, అందరికీ ఈ మహమ్మారి సోకవచ్చు: సీఎం వైఎస్ జగన్ సంచలనం
108 నో.. 104 నో కాల్ లిప్ట్
అనంతపురం జిల్లా ఊరవకొండకి చెందిన ఒకతను కరోనా వైరస్ సోకింది. అయితే అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు భార్య విఫల ప్రయత్నం చేసింది. దవాఖానకు తీసుకెళ్లేందుకు 108కి ఫోన్ చేసింది.. విషయం దాచొద్దు కదా అని కరోనా అని చెప్పడమే పాపమైపోయింది. వారు కరోనా తమ పరిధిలోకి రాదు అని.. 104కి ఫోన్ చేయాలని సూచించారు. 104కి కాల్ చేస్తే ఎంతటికీ లిప్ట్ చేయరు. గంటపాటు ఫోన్ చేసి.. విసిగి వేశారిపోయింది ఆ వివాహిత. చివరికి 108కి కాల్ చేస్తే.. వారు లిప్ట్ చేస్తున్నారు కానీ.. తమ పరిధిలోకి రాదు ఏం చేయలేము అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఆశ వర్కర్ని సంప్రదిస్తే రేపు వస్తానని చెప్పడంతో ఆమె దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయింది.
స్పందించిన ఎస్ఐ..
చివరికీ చేసేదేమీ లేక స్థానిక ఎస్సై ధరణికి ఫోన్ చేశారు. ఆయన స్పందించి ప్రైవేట్ అంబులెన్స్ పంపించారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. అతను చనిపోయాడు. కానీ కరోనా రోగి అంత్యక్రియలను కూడా ఎస్సై ధరణి దగ్గరుంచి జరిపించారు. తన బంధువులు, కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు అని.. ఎస్సై మాత్రం జరిపించారని మృతుడి భార్య కొనియాడారు. స్థానికంగా కూడా ఎస్సై చేసిన మంచి పనిని అభినందిస్తున్నారు. నారా లోకేశ్ కూడా అభినందనలు తెలిపారు. మిగతా వారు స్పందించకున్నా.. మీరు రియాక్టయ్యారని ట్వీట్ చేశారు.
వీడియో ట్వీట్
ఉరవకొండ ఘటనకు సంబంధించి బాధితురాలి వీడియోను లోకేశ్ ట్వీట్ చేశారు. ఇటీవలే ప్రారంభించిన 104, 108 సిబ్బంది ఎందుకు స్పందించలేదు అని లోకేశ్ ప్రశ్నించారు. డబ్బుల కక్కుర్తితో రాష్ట్రంలో వ్యవస్థలు నీరుగారిపోయాయని ఉదహరించారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఒకరి ప్రాణం పోయిందని తెలిపారు. 108 వాహనాల కొనుగోళ్లలో జరిగిన రూ.307 కోట్ల స్కాంతో అతని ప్రాణాలు వెనక్కి వస్తాయా అని అడిగారు. 108 సిబ్బంది మానవత్వంతో స్పందిస్తే.. వివాహిత భర్త బతికి ఉండేవాడు అని చెప్పారు.
Recommended Video
భారీ కుంభకోణం..
104, 108 వాహనాల్లో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పుట్టినరోజు కానుకగా 307 కోట్ల రూపాయలు కట్టబెట్టారని కామెంట్ చేశారు. అనుభవం గల సంస్థను పక్కనపెట్టి.. విజయసాయిరెడ్డి వియ్యంకుడికి కాంట్రాక్ట్ ఇచ్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో 1800 అంబులెన్స్లు ఉండేవని గుర్తుచేశారు. లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అంబులెన్స్ ఉండేవని.. జగన్ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన అంబులెన్స్ ఏంటీ అని ప్రశ్నించారు. ఆ తీసుకొచ్చిన అంబులెన్స్ కూడా ప్రజల ప్రాణాలను కాపాడటం లేదు అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.