రూపాయికే రొట్టే పప్పు ఎస్పీవై రెడ్డి కన్నుమూత : సంతాపం తెలిపిన చంద్రబాబు, పవన్
హైదరాబాద్ : నంద్యాల ఎంపీ, నంది గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి (69) కాసేపటి క్రితమే మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఎస్పీవై రెడ్డి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. ఎస్పీవై రెడ్డి చనిపోయినట్టు కేర్ ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించారు. ఎస్పీవై రెడ్డి మృతితో ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అనారోగ్యంతో కన్నుమూత
ఎస్పీవై రెడ్డి గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను ఈ నెల 3న తేదీన కేర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటినుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఆరోగ్యం విషమించడంతో మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
నిట్లో ఇంజినీరింగ్ .. వ్యాపారరంగ ప్రవేశం
1950 జూన్ 4న కడప జిల్లా అంకాలమ్మ గూడూరులో ఎస్పీవై రెడ్డి జన్మించారు. వరంగల్ నిట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్లో పట్టా పొందారు 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి దిగారు. 2004, 2009, 2014లలో నంద్యాల నుంచి ఎంపీగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి నంద్యాల బరిలో నిలిచారు.
రూపాయికే రొటి
ఎస్పీవై రెడ్డి రూపాయికే రొట్టే పప్పు అందించేవారు. కర్నూలులో ఉన్న పేదలను దృష్టిలో ఉంచుకొని ఆయన విశాల హృదయంతో అతి తక్కువ ధరకు పప్పు రొట్టే అందించి పేద ప్రజల మన్ననలు పొందారు. ఆయనను ఇప్పటికీ పేదలు రూపాయికే పప్పు రొట్టి అందించిన రెడ్డిగా పిలుచుకుంటారు. తమ కడుపు నింపిన ధీశాలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి ... పేదలు రోదిస్తున్నారు. ఎస్పీ వై రెడ్డి మృతిపై జనసేనాని పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.
చంద్రబాబు సంతాపం
ఎస్పీవై రెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. పారిశ్రామికవేత్తగా, స్వచ్చంద సేవకుడిగా సేవలు చేశారని కొనియాడు. కర్నూలు జిల్లాకు, నంద్యాల ప్రాంతానికి ఎస్పీవై రెడ్డి చేసిన సేవలు మరవలేనివని కీర్తించారు. నంది గ్రూప ద్వారా అనేకమందికి ఉపాధి కల్పించారని .. ఆయన మృతి కర్నూలు జిల్లాకు తీరనిలోటన్నారు. రెడ్డి కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.