ఏపీలోనూ మందుబాబుల గగ్గోలు- హానికర ద్రవ్యాలు సేవించి అనారోగ్యంపాలు..
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం మందుబాబులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇప్పటివరకూ ఏదో రకంగా నిషేధాన్ని సైతం తట్టుకుని వివిధ మార్గాల్లో మద్యం సంపాదించి తాగిన వీరికి.. కొన్నిరోజులుగా పూర్తిగా సరఫరా నిలిచిపోవడంతో చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. హానికర రసాయనాలను సైతం సేవిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై ప్రభుత్వం తాజాగా సీరియస్ అయింది.
కరోనాతో మందుషాపులూ బంద్..
కరోనా వైరస్ ప్రభావం పెరిగిన నేపథ్యంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ ఇప్పుడు మందుబాబుల పాలిట శాపంగా మారుతోంది. నిత్యం మందు తాగకపోతే ఇంటికెళ్లని, నిద్రపోని వీరంతా ఇప్పుడు ఏం చేయాలో తెలియక విలవిల్లాడుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో ఇప్పటికే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా.. మద్యం విక్రయాలు కాస్త తక్కువగా ఉండే ఏపీలోనూ ఈ ప్రభావం మొదలైంది. మద్యం షాపులు మూసేసి పది రోజులు దాటి పోవడంతో ఇప్పుడు మందుబాబులకు ఏం చేయాలో తెలియని పరిస్ధితి.
ప్రత్యామ్నాయంగా హానికర రసాయనాలు...
మద్యం షాపులు, బార్లు అన్నీ మూతపడటంతో ఇప్పుడు నిత్యం అక్కడికి వెళ్లకపోతే రోజు గడవని మద్యం ప్రియులంతా అల్లాడుతున్నారు. దీంతో వారు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టారు. మద్యానికి బదులుగా అందుబాటులో ఉన్న రసాయనాలను, డ్రగ్స్ ఆశ్రయిస్తున్నారు. ఇవి కూడా వారికి అలవాటు లేకపోవడంతో వాటిని సేవించి అనారోగ్యం పాలవుతున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని పలుచోట్ల ఇలాంటి కేసులు నమోదు కావడంతో ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది.
కల్తీని ఆశ్రయించారో ఖబడ్డార్ ..
ఏపీలో ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా మద్యపాన నిషేధం కొనసాగుతోందని, ప్రజలు అక్రమంగా మద్యం పొందడం కానీ, ప్రత్యామ్నాయంగా హానికర రసాయనాలు సేవించడం కానీ నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. మద్యానికి బానిసలై సహనం కోల్పోయి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న వారు, అనారోగ్యం పాలవుతున్న వారి కేసులు తమ వద్దకు వస్తున్నాయని, వీటిపై కఠినంగా వ్యవహరిస్తామని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వినీత్ బ్రిజ్ లాల్ హెచ్చరించారు. మద్యానికి బానిసలైన వారి పట్ల కుటుంబ సభ్యులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
అక్రమ విక్రయాల పై టోల్ ఫ్రీ నెంబర్ 18004254868, 9491030853, 08662843131 కు సమాచారం అందించాలని బ్రిజ్ లాల్ కోరారు.