'భారతి పేరు మీది ఆస్తులు 2016లోనే జఫ్తు నిజం కాదా, ఎంత క్షోభ అనుభవించారో'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి పేరు మీద ఉన్న ఆస్తులు రెండేళ్ల కిందటే జఫ్తు అయ్యాయనేది నిజం కాదా చెప్పాలని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర సోమవారం ప్రశ్నించారు.
Recommended Video
అత్యున్నత వ్యవస్థలో ఉన్న వారిని బ్లాక్ మెయిల్ చేయడం వైయస్ జగన్ నైజం అన్నారు. వైయస్ భారతిపై ఉన్న ఆస్తులు 2016లో జఫ్తు కావడం వాస్తవమా కాదా ప్రతిపక్ష నేత చెప్పాలన్నారు. జగన్ అవినీతికి మహిళా ఐఏఎస్ అధికారులు ఎంత క్షోభ అనుభవించారో తెలియదా అని ప్రశ్నించారు.
బెంగళూరు మంత్రి క్లాసిక్ ప్రాజెక్టు ద్వారా జగన్ రూ.194 కోట్లు కొల్లగొట్టారన్నారు. సండూరు పవర్లో పెట్టుబడులు పెట్టింది డొల్ల కంపెనీలు కావా అన్నారు. ముమ్మాటికి జగన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారని చెప్పారు.
కాగా, జగన్ కారణంగానే భారతి ఈడీ కేసులో ఇరుక్కున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తోన్న విషయం తెలిసిందే. సీబీఐ కేసులున్న సంస్థల్లో భారతి డైరెక్టర్గా తప్పుకుందని జగన్ చెప్పారనీ, కానీ విచారణలో అది అబద్ధమని తేలడంతో ఈడీ ఆమె పేరును చార్జ్షీట్లో చేర్చిందని చెబుతున్నారు.
ఈడీ అధికారుల వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ చెప్పడాన్ని ఖండిస్తున్నారు. జగన్ అవినీతిలో భాగస్వామి కాబట్టే భారతి పేరును ఈడీ చార్జీషీట్లోచేర్చిందని చెబుతున్నారు. దేశంలో ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరిగే ఏకైక ప్రతిపక్ష నేత జగన్ అని ఎద్దేవా చేస్తున్నారు.