డూప్లికేట్ 'అభ్యర్థుల ప్రకటన'పై జనసేన స్పందన, ఫిర్యాదు చేయండి.. పవన్ కళ్యాణ్ సీరియస్
అమరావతి: జనసేన పార్టీ నకిలీ లెటర్ ప్యాడ్ కలకలం రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతకంతో కూడిన నకిలీ లెటర్ ప్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. జనసేన నుంచి బెజవాడలో పలువురికి టిక్కెట్లు ఇస్తున్నట్లు నకిలీ లెటర్ ప్యాడ్ ద్వారా ప్రకటన చేశారు.
ఈ నకిలీ లెటర్ ప్యాడ్ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్గా ఉన్నారు. రేపు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ లీగల్ సెల్ నేతలకు జనసేనాని ఆదేశాలు జారీ చేశారు. పవన్ కళ్యాణ్ సంతకంతో ఉన్న జనసేన నకిలీ లెటర్ ప్యాడ్ రెండు రోజులుగా నెట్లో వైరల్ అవుతోంది. తమ పార్టీ అభ్యర్థులకు సహకరించాలని, వారిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ అందులో పేర్కొన్నట్లుగా ఉంది.
మైండ్ గేమ్, ఆ కుటుంబాలను ఎదుర్కొనేందుకు సిద్ధంకండి: జనసైనికులకు పవన్ కళ్యాణ్
విజయవాడలో ముగ్గురు అభ్యర్థులు వీరే అంటూ
ఆ నకిలీ లెటర్ ప్యాడ్లో 'విజయవాడ సెంట్రల్ శాసన సభ అభ్యర్థిగా శ్రీ కొంగటి సత్యం గారిని, తూర్పు శాసన సభ అభ్యర్థిగా శ్రీ పొతిన మహేష్ గారిని, పశ్చిమ శాసన సభ అభ్యర్థిగా శ్రీ కొరడా విజయ కుమార్ గారిని, ఖరారు చేయడం జరిగిందని' అందులో పేర్కొన్నారు. దీనిపై జనసేన, పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నాయి.
ఇది నిజం కాదు
'విజయవాడ నగర పరిధిలోని నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో వచ్చిన ప్రెస్ నోట్ నిజం కాదని, పార్టీ ఎవరిని కూడా అభ్యర్థులుగా ఖరారు చేయలేదని, జనసేన పార్టీకి సంబంధించిన వివరాలు ఏవైనా సరే పార్టీ విడుదల చేస్తుందని, దయచేసి జనసైనికులు, ప్రజలు గమనించగలరని పేర్కొన్నారు. ఇది నిజం కాదు.. అని పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది.
గతంలోను ప్రచారం, కన్ఫ్యూజ్ చేసేందుకే
అసలు ఈ నకిలీ లెటర్ ప్యాడ్ ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో జనసేన వర్గాలు ఆరా తీస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ప్రకటించకముందే జనసైనికులను కన్ఫ్యూజ్ చేసేందుకు ఇలాంటివి చేస్తున్నారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు లెటర్ ప్యాడ్ ద్వారా అసత్య ప్రచారం జరిగింది. గతంలోను పవన్ ప్రకటించకముందే ఓ అభ్యర్థిని ప్రకటించినట్లుగా కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దానిని కూడా జనసేన ఖండించింది.