రెండు తెలుగు రాష్ట్రాల్లో డూప్లికేట్ ఓటర్లు ఎందరో తెలుసా ?
Recommended Video
తెలుగు భాష మాట్లాడే ఓటర్లు తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉండాలని భావించారో ఏమో అక్కడ ఇక్కడ ఎడాపెడా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. రెండు చోట్ల ఎన్నికల్లో పాల్గొని తమ సత్తా చాటాలని ఉన్న తెలుగు ఓటర్లు 2014 ఎన్నికల్లోనే రెండు చోట్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు నమోదు చేసుకున్న ఓటర్లందరూ తెలిస్తే షాక్ అవుతారు.
తెలుగు రాష్ట్రాల్లో 20లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు
అక్షరాల 20 లక్షల మంది ఓటర్లు రెండు రాష్ట్రాల్లోనూ ఓటరు నమోదు చేసుకొని వేర్వేరు సమయాల్లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సందర్భంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు అని తెలుస్తుంది. ఇక పార్టీల భవితవ్యాన్ని, ప్రభుత్వాల్ని మార్చగలిగే స్థాయిలో డూప్లికేట్ ఓటర్లు ఉండడం తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ పార్టీలకు ఇబ్బందికర పరిణామమే. 2018 నవంబరు వరకు సుమారు 20 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును రెండు రాష్ట్రాల్లో నమోదు చేసుకొని డూప్లికేట్ ఓటింగ్ కు పాల్పడుతున్నట్లు గా తెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రజత్ కుమార్ లేఖ..
డూప్లికేట్ ఓటింగ్ కు చెక్ పెట్టేందుకే ఒకేసారి ఎన్నికలు
ఇక దీనికి చెక్ పెట్టడం కోసం ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో ను ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఓటర్లు ఏదో ఒక ప్రాంతం నుండి తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుంది. డూప్లికేట్ ఓటింగ్ కు చెక్ పడుతుంది. ఇంత పెద్ద ఎత్తున డూప్లికేట్ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సైతం కేంద్ర ఎన్నికల సంఘానికి ఒకే దఫాలో ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డూప్లికేట్ ఓటర్లకు చెక్ పెట్టే దిశగా నిర్ణయం తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం మొదటి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. దీంతో డూప్లికేట్ ఓటింగ్ కు చెక్ పడుతుందని అటు ఎన్నికల అధికారులు, రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.