రోజా కోరిక తీర్చిన దుర్గమ్మ ... ఇంతకీ రోజా ఏం కోరుకున్నారంటే
ఏపీఐఐసీ చైర్మన్ రోజా ఈరోజు ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గాదేవి దర్శించుకున్నారు. అమ్మవారు గతేడాది తాను కోరిన కోరికను తీర్చినట్లు గా రోజా చాలా సంతోషంగా తెలిపారు. కోరిన కోరికలు తీర్చే తల్లి తన కోరికను నెరవేర్చిందని అందుకే మొక్కు చెల్లించుకున్నానని రోజా తెలిపారు. ఇంతకీ రోజా కోరుకున్న కోరిక ఏంటి అమ్మవారి ఆ కోరికను ఎలా తీర్చారు అంటే ...
గత సంవత్సరం నవరాత్రి రోజుల్లో మూలా నక్షత్రం రోజున తాను బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రోజా ఓ కోరిక కోరుకున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని రోజా మొక్కుకున్నారట . అది తీరడంతో ఈ సంవత్సరం తిరిగి ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గాదేవి ని దర్శించుకుని, మొక్కు తీర్చుకున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా పేర్కొన్నారు. ఈ ఉదయం సరస్వతీ దేవి అలంకారంలో భక్తులనుకరుణిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న ఆమె, మీడియాతో మాట్లాడి ఈ విషయాన్ని వెల్లడించారు .
గత సంవత్సరం ఇదే రోజున తాను జగన్ సీఎం కావాలని మొక్కుకున్నానని చెప్పి మళ్లీ ఇదే రోజున తన కోరికను నెరవేర్చినందుకు అమ్మను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం గా పరిపాలన సాగిస్తున్న జగన్ కు పాలనా విధుల్లో ఎటువంటి ఆటంకాలూ లేకుండా చూడాలని ఈ సంవత్సరం అమ్మను కోరానని తెలిపారు. ఇక ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు రోజా. అధికారులు మెరుగైన ఏర్పాట్లు చేశారని అన్నారు. భక్తులు అమ్మను ప్రశాంతంగా దర్శించుకుంటున్నారని రోజా తెలిపారు. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గగుడికి భక్తజనంతో పోటెత్తింది. నేడు సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి దసరా వేడుకలను ఘనంగా దేవాదాయ శాఖ నిర్వహిస్తోంది.