భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి -మహాలక్ష్మీ అలంకారంలో..!!
దసరా నవరాత్రుల వేళ ఇంద్రకీలాద్రి పైన భక్త జనం పోటెత్తుతున్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు వేడుకల్లో భాగంగా శనివారం మహాలక్ష్మీ అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిస్తోంది. ఇప్పటికే రాజకీయ- అధికార ప్రముఖులు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. తెలంగాణ మంత్రి తలసాని అమ్మవారిని దర్శించుకున్నారు. అధికారుల అంచనాలను మించి భక్తులు తరలి వస్తున్నారు. మూలా నక్షత్రం నాడు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అందరూ సహకరించాలని కోరుతున్నారు. ఇప్పటివరకూ మూడు లక్షల మందికి పైగా భక్తులు దేవీ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. వివిధ సేవలు, టిక్కెట్లు, ప్రసాదాల విక్రయాలపై రూ.31.40 లక్షలు ఆదాయం వచ్చింది. మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనిమిస్తున్న అమ్మవారిని పూజించేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు.
లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా అమ్మవారిని కొలుస్తున్నారు. తెల్లవారు జాము నుంచే కొండకు చేరుకుంటున్న భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
ఐదో రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల రద్దీతో సాధారణ ప్రజలకు..ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్టోబర్ 5వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపు నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు స్పష్టం చేసారు. ఇక, దేవాదాయ శాఖ అధికారులతో పాటుగా జిల్లా అధికారులు ప్రత్యేకంగా భక్తుల సౌకర్యాల పైన ఫోకస్ పెట్టారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి దర్శనం కోసం లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.