ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు-రోజుకు 30 వేలమందే-దర్శనాలకు ఆన్ లైన్ బుక్సింగ్స్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల 7 నుంచి 15వరకూ జరిగే అమ్మవాతి నవరాత్రుల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా దేవాదాయశాఖ మంత్రి, స్ధానిక ఎమ్మెల్యే కూడా అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ముందుగా దసరా ఏర్పాట్లపై మంత్రి వెల్లంపల్లి క్షేత్రస్ధాయిలో పర్యటించి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్, విజయవాడ సీపీ, విజయవాడ మేయర్ తో కలిసి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దసరాకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. అనంతరం వీఎంసీ కౌన్సిల్ హాల్లో దసరా సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ నివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, సీపీ బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జెసి మాధవి లత, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు కూడా హాజరయ్యారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అన్ని శాఖల అధికారుల నుంచి వివరాలు సేకరించిన మంత్రి వెల్లంపల్లి వారికి పలు కీలక సూచనలు చేశారు.
దసరా ఉత్సవాల నిర్వహణ విషయంలో సమన్వయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ దృష్ట్యా ఈ ఏడాది రోజుకు 30 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతివ్వాలని నిర్ణయించారు. మూలానక్షత్రం రోజున కేవలం 70 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వబోతున్నారు. అక్టోబర్ 7 నుంచి 15 వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరగనుండగా.. అన్ని శాఖలూ అప్రమత్తంగా ఉండాలని సర్కులర్ జారీ చేశారు. దసరాలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆన్ లైన్ స్లాట్ తప్పనిసరి చేశారు. ఆన్ లైన్ స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి అనుమతి ఇవ్పబోతున్నారు.
దసరా ఏర్పాట్లపై ఫీల్డ్ ఇన్ఫెక్షన్ చేస్తున్న దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి,కలెక్టర్,విజయవాడ సీపీ నగర మేయర్#vijayawada #dussehra #vellampalli #oneindiatelugu pic.twitter.com/g7D4vTG8i6
— oneindiatelugu (@oneindiatelugu) September 23, 2021
కొండ కింద ఆన్ లైన్ కౌంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. 7 వతేదీన శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు. దసరా లో మాలధారణ గావించిన భక్తులకు అనుమతినివ్వాలో లేదా అనే దానిపై కో ఆర్డినేషన్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మరోవైపు గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. మూల నక్షత్రం రోజు గుడి ప్రారంభ, ముగింపు టైమింగ్స్ ను కూడా భక్తులకు ముందే తెలియజేస్తే బాగుంటుందని ఆయన కమిటీకి సూచించారు. సీసీ టివి లను కూడా 24 గంటలూ పనిచేసేటట్టు చూసుకోవాలన్నారు. సీసీ టీవీలను పర్యవేక్షించడానికి ప్రత్యేక టీమ్ ను నియమించాలని కూడా కమిషనర్ సూచించారు. వీఐపీ ప్రోటోకాల్ కి కూడా ప్రత్యేకంగా ఒక టీమ్ పెట్టడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి 24 గంటలూ సర్వీస్ అందించేలా చూడాలన్నారు.