వైఎస్ వర్ధంతి సాక్షిగా బయటపడిన గన్నవరం వైసీపీ విభేదాలు- జగన్ ఆదేశాలూ బేఖాతర్...
కృష్ణా జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ జెండా మోసిన నేతలకూ, తాజాగా పార్టీలోకి వచ్చిన నేతలకు మధ్య సాగుతున్న వర్గ పోరు మాజీ సీఎం వైఎస్ వర్ధంతి సందర్భంగా మరోసారి రచ్చకెక్కింది. గన్నవరం వైసీపీలో ఉప్పూ, నిప్పులా ఉంటున్న దుట్టా రామచంద్రరావు, వల్లభనేని వంశీ వర్గాలు వర్ధంతి కార్యక్రమం సందర్భంగా హోరాహోరీకి దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. చివరికి పార్టీ నేతలు వారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే పార్టీ అధినేత జగన్ ఈ రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ వివాదం జరగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
గన్నవరం వైసీపీలో వర్గపోరు..
క్రియాశీల రాజకీయాలకు కేంద్రబిందువైన గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ గతంలో ఎన్నడూ లేనంత వర్గ విభేదాలను ఎదుర్కొంటోంది. గతంలో వైఎస్ వర్గీయుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుకూ, తాజాగా టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ప్రకటించిన స్ధానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఎప్పటికప్పుడు కాక రేపుతూనే ఉంది. ఈ వ్యవహారం కాస్తా అధినేత జగన్ దృష్టికి కూడా వెళ్లింది. వంశీ ఏకపక్ష నిర్ణయాలపై స్వయంగా దుట్టా రామచంద్రరావు సీఎం జగన్ను కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. ఈ వ్యవహారం సాగుతుండగానే వీరి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది.
వైఎస్ వర్ధంతి సాక్షిగా...
ఇవాళ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమం సాక్షిగా దుట్టా, వంశీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద వైఎస్ విగ్రహం వద్ద వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడికి జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, వెల్లంపల్లి, ఎమ్మెల్యే వంశీ హాజరు కావాల్సి ఉంది. అయితే వంశీతో పాటు ఆయనకు సన్నిహితంగా ఉంటున్న మంత్రులు కూడా రాకముందే వైఎస్ విగ్రహానికి దుట్టా వర్గీయులు పూలమాల వేసేశారు. దీంతో అనంతరం అక్కడికి చేరుకున్న మంత్రులు అవాక్కయ్యారు. దుట్టా వర్గీయులపై వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాము పూలమాల వేయలేదంటూ దుట్టా వర్గం జవాబివ్వడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
Recommended Video
జగన్ చెప్పినా, బాబాయ్ వద్దన్నా...
వాస్తవానికి గన్నవరం వైసీపీలో నెలకొన్న విభేదాల పరిష్కారానికి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ రంగంలోకి దింపారు. అదే సమయంలో దుట్టా, వంశీ వర్గీయులు కలిసి పనిచేయాలని జగన్ ఆదేశించారు. నిన్న దుట్టా, వంశీ ఇద్దరినీ కూర్చోబెట్టి వైవీ సుబ్బారెడ్డి చర్చలు కూడా జరిపారు. కానీ 24 గంటలు గడవక ముందే తిరిగి వీరిద్దరూ ఆధిపత్య పోరుకు తెరలేపడంతో జగన్, వైవీ ఆదేశాలు బేఖాతర్ అయినట్లయింది. దీనిపై పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్, వైవీ మాట కూడా లెక్కచేయకుండా గన్నవరంలో ఆధిపత్య పోరు కొనసాగించడంతో ఇరువర్గాలపైనా పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.