నన్నే గెలిపించాలి...లేకుంటే మీకే ఇబ్బంది:డ్వాక్రా సంఘాల సభ్యులతో సిఎం చంద్రబాబు
అమరావతి:"మీ భవిష్యత్తు బాగుండాలంటే మళ్లీ నన్నే గెలిపించాలి, లేకుంటే మీకే ఇబ్బంది"...అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా సంఘాల సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
బుధవారం అమరావతిలో ' చంద్రన్న పసుపు - కుంకుమ ' కార్యక్రమంపై డ్వాక్రా సంఘాల సభ్యులతో సిఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అభివృద్ధి జరగాలంటే టిడిపి ఎమ్మెల్యేలందరినీ గెలిపించాలని, వచ్చే ఆరు నెలలు తమ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. డ్వాక్రా సంఘాల సభ్యులంతా సైనికుల్లా పనిచేయాలని, ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
డ్వాక్రా సంఘాల సమస్యలు వాటికి అందిన పరిష్కారాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, వాటిపై తమ తమ అభిప్రాయాల్ని సామాజిక మాధ్యమాలలో ఉంచితే ప్రభుత్వానికి విస్తృత ప్రచారం వస్తుందని సిఎం చంద్రబాబు వారికి సూచన చేశారు. అందుకోసం మీకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో బిజెపి, వైసిపి ఆటలు సాగవని చెప్పే బాధ్యత డ్వాక్రా మహిళలపై ఉందని, ప్రతిఒక్కరూ పది మందిని ఒప్పించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని అత్యధిక శాతం ప్రజలు తన పక్షానే ఉన్నారన్నారు. ఇంతమంది తమ వైపు ఉండగా బిజెపి, వైసిపికి కనీసం డిపాజిట్లు కూడా రావన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడంలేదని సిఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. బిజెపి, వైసిపి, పవన్ కళ్యాణ్, కెసిఆర్ అంతా కలిసినా తాను భయపడేదిలేదని చెప్పుకొచ్చారు.
డ్వాక్రా సంఘంలోని ప్రతి ఒక్కరికీ 'పసుపు-కుంకుమ' కార్యక్రమం కింద రూ.10 వేలు అందజేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఇప్పటివరకు రూ 8,604 కోట్లు ఖర్చు చేశామని, అదనంగా మరో రూ 2 వేల కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డలకు ఇచ్చే ఈ సొమ్మును వారే వినియోగించుకునేలా చూడాలని, అలా కాకుండా ఇతర అప్పులకో, వేరే అకౌంట్లోకి మళ్లిస్తే సహించేది లేదని బ్యాంకర్లను హెచ్చరించడం జరిగిందన్నారు. బ్యాంకులకు డ్వాక్రా సంఘాల నుంచి దాదాపు 98 శాతం రుణాల రికవరీ ఉందని ఈ సందర్భంగా సిఎం వారిని అభినందించారు.
అలాగే డ్వాక్రా సంఘాల ద్వారా డిసెంబర్ నుంచి ' రక్ష ' కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినిలకు, పేద కుటుంబాలలో మహిళలు, బాలికలకు సబ్సిడీపై రూపాయికే శానిటరీ న్యాప్కిన్లు అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. మరోవైపు చంద్రన్న భీమా, పెళ్లి కానుక వంటి కార్యక్రమాల అమలులో సాధికార మిత్రల పాత్ర అభినందనీయమన్నారు. వారి పనితీరువల్లే చంద్రన్న బీమా కార్యక్రమానికి ప్రజల నుంచి అత్యధిక సంతృప్తి స్థాయి వస్తోందని చంద్రబాబు అభినందించారు.