ద్వారకా తిరుమల కుర్రోడికి కోటి రూపాయల బంపర్ ఆఫర్
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల కుర్రోడు ఇమ్మడి పృథ్వీతేజ్కు కొరియా కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కోటి రూపాయల వార్షిక వేతనంతో ప్రాంగణ నియామకంలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా అతను ఎంపికయ్యాడు. 2011లో పృథ్వీతేజ్ ఐఐటి ప్రవేశ పరీక్షలో అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించాడు.
ప్రస్తుతం అతను ఐఐటి ముంబైలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఆగస్టులో జరిగిన ప్రాంగణ నియామకంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ పృథ్వీతేజ్కు కోటి రూపాయల వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు ఇటీవలే అతనికి లేఖలు అందాయి.
అతని తల్లిదండ్రులు రాణి, శ్రీనివాసరావు ద్వారకా తిరుమలలో బంగారు నగల దుకాణం, కిరణా దుకాణం నిర్వహిస్తున్నారు. తన కుమారుడు ప్రయోజకుడు కావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇటీవలి కాలంలో ప్రపంచంలోని బడా సాఫ్ట్వేర్ సంస్థలు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీయువకులను భారీ వేతనాలతో తీసుకుంటున్నాయి. తాజాగా, పృథ్వీతేజ్కు దక్షిణ కొరియా కంపెనీ భారీ స్థాయిలో వేతనం ఇస్తూ నియమించుకోవడానికి ముందుకు ముందుకు వచ్చింది.