పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం: వారి వల్లే అశాంతి అంటూ ఎమ్మెల్యే ద్వారంపూడి
కాకినాడ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు సరిగా లేదంటూ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో ద్వారంపూడిపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కాకినాడ ఎమ్మెల్యే స్పందించారు.
పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం..
ప్లాన్ ప్రకారమే తమ ఇంటిపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని ద్వారంపూడి ఆరోపించారు. ధర్నా ఎక్కడ చేశారని.. తన ఇల్లు ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. జనసేన నేత నానాజీ పవన్ కళ్యాణ్కు తప్పుడు సమాచారం ఇచ్చారని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నేతలను తప్పుదారి పట్టించే మనస్తత్వం నానాజీది అని.. ఆ విషయం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని సూచించారు.
చంద్రబాబు, పవన్ కలిసి..
దాడుల సంస్కృతి జనసేన పార్టీదేనని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అన్నారు. రాజధాని సాకుతో అలజడి సృష్టిస్తున్నారని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ద్వారంపూడి మండిపడ్డారు. ఇతర ఏరియాల నుంచి మహిళలు తీసుకొచ్చి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రంలో అశాంతి కలిగిస్తున్నారని అన్నారు. పవన్, చంద్రబాబు భాష నేర్చుకోవాలని.. వారి భాష బాగుంటే తామంతా బాగుంటామని ద్వారంపూడి అన్నారు.
పవన్పై ద్వారంపూడి అనుచిత వ్యాఖ్యలతో..
కాగా, పవన్ కళ్యాణ్పై ద్వారంపూడి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గత ఆదివారం జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. ద్వారంపూడి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని లాఠీఛార్జీ చేశారు. అంతకుముందు వైసీపీ, జనసేన కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో పలువురు జనసేన నాయకులు గాయాలపాలయ్యారు.
ద్వారంపూడికి పవన్ హెచ్చరిక
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మంగళవారం కాకినాడలో పర్యటించి గాయపడిన నేతలను, కార్యర్తలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ద్వారంపూడిపై తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి ఇలాంటి దాడులు జరిగితే సహించేది లేదని, తాము దాడులకు దిగితే ఎవరూ ఇక్కడ తిరగలేరంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలంతా బూతులే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ భాషను మార్చుకోవాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. పాలేగాళ్లు, ఫ్యాక్షన్ రాజకీయాలను సహించమన్నారు. ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకోవద్దని పిలుపునిచ్చారు.