పవన్ను ఏకేసిన ద్వారంపూడి, ఉపసంఘంలో వీరే..
కాకినాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి బుధవారం మండిపడ్డారు. ప్రజలు అన్యాయానికి గురైతే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఈ రోజు వరకు కనిపించడం లేదన్నారు.
కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీల కారణంగా ప్రజలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. టీడీపీ మోసపూరిత హామీల అమలుకు ప్రజలు చేపట్టే పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
రాజధాని భూసమీకరణకు మంత్రివర్గ ఉపసంఘం
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉపసంఘంలో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావు, పల్లె రఘునాథ్ రెడ్డి, రావెల కిషోర్ బాబులు ఉన్నారు.