ఈ పార్టీ సమావేశాలకు ప్రయత్నాలు: పల్లె రఘునాథ రెడ్డి
తిరుపతి : ఈ-ఆఫీస్, ఈ-కేబినెట్ తో పాటు త్వరలో ఈ-పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇన్ఫ్ర్మేషన్ టెక్నాలజీకి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రావిణ్యం సంపాదించడానికి రాజకీయ నాయకులకు ప్రత్యేక శిక్షణను ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాయలసీమలో వెనుకబడిన నీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. ప్రతీ 3 నెలలకు ఒకసారి మేధోమథన సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. జిల్లాల్లో అభివృద్ధిలో పురోగతిపై చర్చించనున్నట్లు తెలిపారు.
ఆర్థికంగా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామని, ప్రభుత్వం, ఉద్యోగులు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని మంత్రి పల్లె పిలుపునిచ్చారు.