రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రాలదే: టీడీపీ ఎంపీ ప్రశ్నకు కేంద్రం లిఖితపూరకంగా.. !
Recommended Video
న్యూఢిల్లీ: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పరిపాలనను ఎక్కడి నుంచి కొనసాగించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలనే అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాదని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని నోటిఫై చేస్తూ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్ 25వ తేదీన ఓ జీవోను వెల్లడించిందని పేర్కొంది. ఆ తరువాత అదే ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవలి కాలంలో పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఈ విషయం తమ దృష్టిలో ఉందని తెలియజేసింది.
మంగళవారం ఉదయం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ లిఖిపూరకంగా సమాధానం ఇచ్చారు. ఏపీలో మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. కేంద్రం దృష్టికి వచ్చినట్లయితే.. దీనిపై తన అభిప్రాయాన్ని, స్పందనను తెలియజేయాలని కోరారు.
మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తుందా? అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణానికి విఘాతం కలుగుతుందని, రాజధానిగా అమరావతి నిర్మాణానికి భూములను ఇచ్చిన రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. దీన్ని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ విజ్ఙప్తి చేశారు.
దీనిపై నిత్యానంద రాయ్ లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలను చేపట్టిందనే విషయం మీడియాలో కథనాలు వచ్చాయని అన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని వివరించారు. అయినప్పటికీ.. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం.. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, కేంద్రం జోక్యం చేసుకోబోదని అన్నారు. రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని, అది ఆయా రాష్ట్రాల అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు.