దిగొచ్చిన టీ: షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సెలింగ్
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియపై సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం దిగి వచ్చినట్లు కనిపిస్తోంది. తాము విడిగా కౌన్సెలింగ్ నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం మొండికేస్తూ వచ్చింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం బుధవారంనాడు జరిగిన ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల కమిటీ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన సమావేశాలకు వారు గైర్హాజరయ్యారు.
బుధవారంనాడు జరిగిన సమావేశానికి తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ కమిషర్ శైలజా రామయ్య హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సమావేశమయ్యారు. వారు ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం జరిగే సమావేశం గురించి ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ అజయ్ జైన్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ జరుగుతుందని ఎపి ఉన్నత విద్యా మండలి చైర్న్ వేణుగోపాల్ రెడ్డి సమావేశానంతరం ప్రకటించారు. రేపటి నుంచి రెండు రాష్ట్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తామని చెప్పారు.
రెండు రాష్ట్రాల్లో కూడా ఆగస్టు 31వ తేదీలోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేసి, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. మరోసారి ప్రవేశాల కమిటీ భేటీ ఉంటుందని చెప్పారు.
ఒకటి, రెండు రోజులు ఆలస్యమైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రవేశ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. కొన్ని విషయాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు ఆయన తెలిపారు.