తెలంగాణలో ఏంజరుగుతోంది: అసెంబ్లీ రద్దుపై బాబు ఆరా, కేసీఆర్కు ధీటుగా!
అమరావతి/హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు, ప్రతిపక్షం వైఖరిపై చర్చించారు. ఓటర్ల నమోదు, కేంద్రం తీరుపైనా చర్చించారు. అలాగే తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంపై కూడా చర్చించారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే టీడీపీపై పడే ప్రభావంపై పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వారితో సమాలోచనలు చేశారు. తెలంగాణలో ముందస్తుకు, ఏపీలో ఎన్నికలకు కేడర్ను చంద్రబాబు సమాయత్తం చేసే భాగంలో ఈ సమావేశం నిర్వహించారు.
రోడ్డుపై సామాన్యుడిలా కేటీఆర్: సిగ్నల్ పడగానే కారు దిగి, వైష్ణవికి సెల్ఫీ
తెలంగాణ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న చంద్రబాబు
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సమాయత్తమవుతోన్న విషయం తెలిసిందే. రేపు (సెప్టెంబర్ 6) అసెంబ్లీని రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా ముందస్తుకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. ముందస్తు వస్తే తెలంగాణలో ఏవిధంగా ముందుకు వెళ్లాలి, అలాగే ఏపీపై ఎలా ప్రభావం పడుతుందనే అంశాలపై నేతలతో చర్చిస్తున్నారు.
Recommended Video
విస్తృత పర్యటనకు అవకాశం
కేసీఆర్ కనుక అసెంబ్లీని రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణలో విస్తృతంగా పర్యటించే అవకాశాలపై పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణలో నేతలు చాలామంది ఇతర పార్టీల్లోకి వెళ్లినప్పటికీ బలమైన కేడర్ ఉంది. తెలంగాణలో పర్యటించడం ద్వారా వారిలో ఉత్సాహం నింపి, కొత్త వారిని తెరపైకి తీసుకు రావాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీతో పొత్తు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ద్వారా కూడా పార్టీని నిలబెట్టుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తెరాసను ఓడించాలంటే పోత్తు ఉండాల్సిందేనని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ రద్దు తర్వాత విస్తృతంగా పర్యటిస్తూ.. తెలంగాణలోని పరిస్థితులకు అనుగుణంగా ఆయన ముందుకు సాగనున్నారు. అయితే కేసీఆర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత చంద్రబాబు తన వ్యూహాలకు మరింత పదును పెట్టనున్నారు. తెలంగాణలోని పరిణామాలను ఎప్పటికప్పుడు తెలపాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణను ఆదేశించారు.
కేసీఆర్ ప్రణాళికలు
కాగా, కేసీఆర్ తన ఫాం హౌస్లో ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. గురువారం అసెంబ్లీని రద్దు చేసి, 7 వ తేదీన శుక్రవారం హుస్నాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంగళవారం గవర్నర్తో భేటీ అయిన సీఎస్, ఇతర అధికారులు ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిశారు. గురువారం ఉదయం ఆరు గంటల నుంచే అందుబాటులో ఉండాలని మంత్రులు సహా కేసీఆర్ అందరినీ ఆదేశించారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి తదితర అంశాలపై కూడా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో పెట్టకుండా ఉత్తర్వు ద్వారానే ఇవ్వొచ్చని అంటున్నారు. మరోవైపు ప్రజల ఆశీర్వాద సభ పేరుతో శాసనసభను రద్దు చేసిన మరుసటిరోజే హుస్నాబాద్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ రోజు నుంచి సుమారు 100 సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. దాదాపు ప్రతి నియోజకవర్గ సభలో మాట్లాడనున్నారు. అసెంబ్లీ రద్దయితే మరోవైపు చంద్రబాబు కూడా తెలంగాణలో విస్తృతంగా పర్యటించే అవకాశముంది.