విజయనగరం టు భద్రక్: బోసిపోయిన కోస్తా: 103 రైళ్లు రద్దు!
విశాఖపట్నం: ఫొణి తుఫాను తరుముకొస్తోన్న నేపథ్యంలో దక్షిణ-తూర్పు రైల్వే, తూర్పు కోస్తా జోన్ల రైల్వే అధికారులు ముందు జాగ్రత్తచర్యలు తీసుకున్నారు. తుఫాను ప్రభావానికి గురయ్యే ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. కొన్ని రైళ్లను పరిమితంగా నడిపిస్తున్నారు. భద్రక్-విజయనగరం మధ్య మొత్తం 103 రైళ్లను రద్దు చేసినట్లు తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నిత్యం రైళ్ల కూతలు, ప్రయాణికుల రాకపోకలతో సందడిగా కనిపించే స్టేషన్లు బోసిపోయాయి. కళ తప్పాయి.
బంగాళాఖాతాం నైరుతి ప్రాంతంలో నెలకొన్న ఫొణి తుఫాను తీరం సమీపిస్తున్న కొద్దీ మరింత బలపడుతోంది. దీని ధాటికి ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుఫాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 320 కిలో మీటర్లు, పూరీ తీర ప్రాంతానికి 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని, శుక్రవారం మధ్యాహ్నానికి ఒడిశా వద్ద తీరాన్ని దాటవచ్చని చెబుతున్నారు. పూరీ సమీపంలోని గోపాల్పూర్-చాంద్బలి మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు.
తుఫాను ప్రభావానికి గురయ్యే జిల్లాల్లో ఒడిశా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. తీర ప్రాంతాలను ఖాళీ చేయించింది. పల్లపు ప్రాంతాల్లో నివాసం ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించింది. 17 జిల్లాల్లో జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణా బలగాలను మోహరింపజేసింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి అక్కడి ప్రభుత్వం అన్ని చర్యలను చేపట్టింది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. సెలవుల్లో ఉన్న అధికారులను వెంటనే- విధుల్లో చేరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకూ సెలవులను మంజూరు చేయవద్దని సూచించారు.