ఏపీ కరోనా హాట్స్పాట్లుగా ఆ అయిదు జిల్లాలు: సగం కేసులు అక్కడి నుంచే: తీవ్రత.. మరింత
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ ఉప్పెనలా విరుచుకుపడుతోంది. రోజూ వేలకొద్దీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కేసులు కనిపించిన తొలిరోజుల్లో పదుల సంఖ్యకే పరిమితమైన కేసులు తాజాగా.. వేలల్లో కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకూ అన్ని జిల్లాల్లో అనూహ్యంగా వెలుగులోకి వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరిన వారి వల్ల అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయనేది వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారుల వాదన.
కరోనా కట్టడి చర్యలు ఫలించట్లేదా?
రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య అయిదారు జిల్లాల్లోనే అధికంగా నమోదవుతున్నాయి. హాట్స్పాట్లుగా తయారు అయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో సగం వరకు ఆయా జిల్లాల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు ఆశించిన స్థాయిలో ఫలించట్లేదనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. కరోనా వైరస్ టెస్టులను పెంచడం వల్లే రాష్ట్రంలో కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయని చెబుతున్నప్పటికీ.. కమ్యూనిటీ వ్యాప్తి ఆరంభమైందా? అనే అనుమానాలకు తావిస్తోంది.
సీమలో మూడు జిల్లాల్లో..
రాష్ట్రంలో సగానికి పైగా కేసులు ఆయా జిల్లాల్లోనే నమోదు కావడం పట్ల ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రాయలసీమలోని మూడు జిల్లాల్లో కేసుల తీవ్రత అధికంగా ఉంటోంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ మూడింటితో పోల్చుకుంటే కడప జిల్లాలో కేసుల సంఖ్య తక్కువే కనిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి స్వస్థలాలకు వచ్చిన వారి వల్ల అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో కేసులు పెరుగడానికి కారణమౌతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
కర్నూలులో 10 వేలకు పైగా..
కర్నూలు జిల్లాలో 10 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన కేసులు 10,357కు చేరుకున్నాయి. ఇందులో యాక్టివ్గా ఉన్నవి 4527 అయినప్పటికీ.. మరణాల సంఖ్య ఈ జిల్లాలోనే అత్యధికంగా నమోదైంది. ఇప్పటిదాకా ఒక్క కర్నూలు జిల్లాలోనే 156 మంది మృత్యువాత పడ్డారు. అనంతపురం-8989, చిత్తూరు-6869, కడప-4361 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాపై చెన్నైలోని కోయంబేడు మార్కెట్ ప్రభావం సైతం అధికంగా పడినట్లు చెబుతున్నారు.
Recommended Video
తూర్పు గోదావరి, గుంటూరుల్లో
తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాలతో పోల్చుకుంటే తూర్పు గోదావరిలోనే అత్యధిక కేసులు రికార్డు అయ్యాయి. 12,391 కేసులు ఈ జిల్లాలో వెలుగు చూశాయి. రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలు హాట్స్పాట్లుగా మారినట్లు అధికారులు చెబుతున్నారు. మరణాల సంఖ్య కూడా ఈ జిల్లాలో అధికమే. కర్నూలు, కృష్ణా జిల్లాల తరువాత అత్యధిక మరణాలు తూర్పు గోదావరి జిల్లాలో నమోదు అయ్యాయి. 113 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో 9456 కేసులు నమోదు అయ్యాయి. 97 మంది మృతి చెందారు.