ఆఫీసులో నారా లోకేష్ చేతికి రూ.50వేల చెక్ (ఫోటో)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన అల్లూరి రామభద్ర వర్మ రూ.50వేల విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్కు బుధవారం ఎన్టీఆర్ భవన్లో చెక్ను అందజేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే తేడా లేకుండా తాము పార్టీ కార్యకర్తలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ వారం రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా లోకేష్ హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో లోకేష్ ఆ రోజు బాధ్యతలు స్వీకరించారు.
నారా లోకేష్ తొలుత స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రతి టిడిపి కార్యకర్తకు నూటికి నూరు శాతం సంక్షేమ నిధి ద్వారా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కార్యకర్తలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎపి, టి అనే తేడా లేకుండా కార్యకర్తలను ఆదుకుంటామన్నారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించే సమయానికే ఆయన కుమారుడు నారా లోకేశ్.. పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు.