జనసేన ఎమ్మెల్యే ఆందోళన పేకాట రాయుళ్ల కోసమా? కేసు నమోదు చేసిన పోలీసులు
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ శాసన సభ్యుడు రాపాక వరప్రసాద్ ఇబ్బందుల్లో పడ్డారు. ఆదివారం రాత్రి జిల్లాలోని మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించడానికి గల కారణం.. పేకాట రాయుళ్లను విడుదల చేయించడం కోసమేనని తెలుస్తోంది. మలికిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఎన్ లంక గ్రామంలో పేకాట ఆడుతున్న రాపాక అనుచరుడిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆయనను విడిపించే విషయంలో మలికిపురం ఎస్సై కేవీ రామారావు, రాపాక వరప్రసాద్ మధ్య వివాదం మొదలైందని చెబుతున్నారు.
తన అనుచరుడిని విడిచి పెట్టాలంటూ రాాపాక చేసిన డిమాండ్ ను ఎస్సై పట్టించుకోకపోవడం వల్లే ఆయన పోలీస్ స్టేషన్ ను ముట్టడించారని సమాచారం. మలికిపురం పోలీస్ స్టేషన్ వద్ద ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. దీనితో రాపాకపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తరువాత ఎమ్మెల్యే.. అదృశ్యం అయ్యారని చెబుతున్నారు. పేకాట రాయుళ్ల కోసం తాను ధర్నా చేసినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా వార్తలు రావడం, తనపై కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న వెంటనే ఆయన అదృశ్యం అయ్యారని చెబుతున్నారు.
వీడియో: రాత్రివేళ..జనసేన ఎమ్మెల్యే ఆందోళన#JanaSena pic.twitter.com/Zit0Icxzts
— Oneindia Telugu (@oneindiatelugu) August 12, 2019
ఆదివారం రాత్రి మలికిపురం పోలీస్ స్టేషన్ వద్ద రాపాక బైఠాయించి, ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఓ కేసు విషయమై మలికిపురం ఎస్సై రామారావుకు ఫోన్ చేయగా.. ఆయన స్పందించలేదని, నిర్లక్ష్యంతో సమాధానం ఇచ్చారనేది ఆరోపణ. ఏకవచనంతో సంబోధిస్తూ, కఠిన పదజాలంతో ఎమ్మెల్యేను దూషించారని ఆయన అనుచరులు చెబుతున్నారు. దీనితో ఆగ్రహించిన రాపాక.. ఎనిమిది గంటల సమయంలో తన అనుచరులతో కలిసి మలికిపురం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. ఆ సమయంలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. దుర్భాషలు ఆడారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న రామారావు ఆ సమయంలో స్టేషన్ లో లేరు. సీఐ ఎక్కడికెళ్లారని, వెంటనే స్టేషన్ కు రావాలని ఆయన పట్టుబట్టారు.
స్టేషన్ సిబ్బంది ఎస్సైకి ఫోన్ చేయగా.. స్విచాఫ్ లో ఉన్నట్లు వెల్లడించారు. దీనితో ఆగ్రహించిన రాపాక.. తన అనుచరులతో కలిసి అక్కడే బైఠాయించారు. రామారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ ను ముట్టడించారనే సమాచారం నియోజకవర్గంలో దావానలంలా వ్యాపించింది. జనసేన పార్టీ కార్యకర్తలు బైక్ లు, ఇతర వాహనాల ద్వారా పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అకారణంగా తమ నాయకుడిని దూషించిన రామారావును సస్పెండ్ చేయాలంటూ జనసేన కార్యకర్తలు పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. రామారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆయనను సస్పెండ్ చేసేంత వరకూ తాము అక్కడి నుంచి కదిలేది లేదని కార్యకర్తలు, రాపాక అనుచరులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఫలితంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా ఎస్పీ జోక్యం చేసుకున్నారు. రాపాకకు ఫోన్ చేశారు. ఈ ఘటనకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. తాను ధర్నాకు దిగడానికి ఏర్పడిన పరిస్థితులను ఆయన ఎస్పీకి వివరించారు. దీనిపై తాను స్వయంగా విచారిస్తానని, ఆందోళనను ఉపసంహరించుకోవాలని కోరారు. అయినప్పటికీ- రాపాక, ఆయన అనుచరులు శాంతించలేదు. అప్పటికప్పుడు ఎస్సైని సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు.