'రేవ్ పార్టీ' కేసును ఆ మంత్రి నీరుగార్చారు...మహిళా సంఘాల ఆరోపణ;వివాదంలో విజయవాడ నేతలు
తూర్పుగోదావరి:జిల్లాలోని రంపచోడవరం మండలం సుద్దగొమ్ము వద్ద ఎ 1 రిసార్ట్స్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రేవ్ పార్టీ కేసులోని నిందితులను పోలీసులు వదిలేయడంపై వివాదం రాజుకుంటోంది.
ఇలా నిందితులను వదిలివేయడం వెనుక జిల్లాకు చెందిన ఒక మంత్రి హస్తం ఉందని మహిళా సంఘాల, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆ రిసార్ట్స్ పై దాడి సందర్భంగా పోలీసులు మ మంది యువతులతో సహా మొత్తం 32 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలా అరెస్టైన వారిపై మంత్రి ఒత్తిడితోనే పెట్టీ కేసు పెట్టి వదిలేశారనేది ఆరోపణ. మరోవైపు ఈ వివాదంలో విజయవాడకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
రేవ్ పార్టీ...పోలీసుల దాడి
రంపచోడవరం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ విజయబాబు తమ సిబ్బందితో శుక్రవారం అర్ధరాత్రి సుద్దగొమ్ము ఎ 1 రిసార్ట్స్పై దాడులు నిర్వహించడం, ఎనిమిదిమంది మహిళలతోపాటు 20 మంది పురుషులు, మరో నలుగురు రిసార్ట్స్ సిబ్బందిని పట్టుకోవడం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ వీరు పాల్గొన్న కార్యకలాపాలను బట్టి బలమైన కేసులు పెట్టే అవకాశం ఉన్నా...నిందితులపై సాధారణమైన కేసులే పెట్టి, సిఆర్పిసి నిబంధనల ప్రకారం కోర్టుకు హాజరు కావాలనే నోటీసిచ్చి వారిని పోలీసులు వదిలేశారు. వారివద్ద పట్టుబడిన రూ. 94,000 కోర్టులో జమ చేస్తామనీ, నోటీసులిచ్చిన తర్వాత నిందితులు కోర్టుకు హాజరవుతారని పోలీసులు చెప్పారు.
మంత్రి ఒత్తిడితోనే అలా...ఆరోపణలు
ఇదే జిల్లాకు చెందిన ఓ మంత్రి ఒత్తిడితోనే వారిపై ఎక్కువ శిక్ష పడడానికి అవకాశమున్న సెక్షన్లు కాకుండా సిఆర్పిసి 41ఎ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారన్నది స్థానికుల ఆరోపణ. రేవ్ పార్టీకి సంబంధించి రిసార్ట్స్ యజమాని మహర్షి ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనిలో పాల్గొన్న విజయవాడకు చెందిన యువకులు అక్కడ తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్కడి నాయకులతో ఈ జిల్లాకు చెందిన మంత్రికి గట్టిగా చెప్పించారని దాంతో పోలీసులు కేసు నీరు కార్చుతున్నారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. రిసార్ట్స్ నిర్వహిస్తున్న మహర్షిని ఇంతవరకూ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ సంఘాల...స్పందన
మహర్షి పరారీలోనే ఉన్నాడనిరెండో రోజు కూడా పోలీసులు చెప్పడం వారితో ఉన్న లాలూచీని తెలియజేస్తోందని ఐద్వా రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి పి.తులసి అన్నారు. రిసార్ట్స్ నిర్వాహకుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మన్యంలో గిరిజన సాంప్రదాయాలకు విరుద్ధంగా రేవ్ పార్టీలు నిర్వహించిన మహర్షిని తక్షణమే అరెస్ట్ చేయాలి. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పడం సరికాదు. ఈ విష సంస్కృతిని మన్యంలోకి తీసుకురావడం ఘోరం. దీని వెనుక వున్నవారిని కూడా శిక్షించాలన్నారు. గిరిజన సంఘం తూర్పుగోదావరి జిల్లా నాయకుడు లోతా రామారావు మాట్లాడుతూ..."రేవ్ పార్టీల పేరుతో రిసార్ట్స్ నిర్వాహకులు మన్యంలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రమాదకరం. రిసార్ట్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి"...అని కోరారు.
వివాదంలో...విజయవాడ నేతలు
అయితే ఈ రేవ్ పార్టీకి నేతృత్వం వహించడంతో పాటు చిందులేసిన వారిలో విజయవాడ కార్పొరేషన్లో ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించే కొందరు కార్పొరేటర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇద్దరు కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఓ ప్రముఖ విద్యా అకాడమి వాకర్లు ఈ రేవ్ పార్టీలో పాలుపంచుకున్నారని సమాచారం. గత రెండ్రోజులుగా ఈ ఇద్దరు కార్పొరేటర్లు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకొని స్థానిక నాయకులకు ఎవరికీ అందుబాటులోకి రాలేదని తెలిసింది. ఆదివారం జరిగిన స్థానిక కార్యక్రమాలకు కూడా ఆ ఇద్దరు కార్పొరేటర్లు హాజరుకాలేదు. సాధారణంగా పార్టీ కార్యక్రమాలకు ఏనాడు గైర్హాజరు కాని ఆ ఇద్దరు కార్పొరేటర్లు రాకపోవడం వెనుక తొలుత కారణం తెలియక పై డివిజన్లలో చర్చజరిగిందని, ఇంతలో రేవ్ పార్టీ వ్యవహారం బయటకు రావడం, అందులో ఆ ఇద్దరు కీలకంగా వ్యవహరించారని తెలియడంతో స్థానికులు షాక్ తిన్నారని సమాచారం. దీంతో ఇదే ఇప్పుడు విజయవాడ కార్పోరేషన్ లో హాట్ టాపిక్ గా మారింది.