చంద్రబాబుకు షాక్ : పిలిచినా పలకని తోట త్రిమూర్తులు: సీఎం జగన్ తో భేటీ..!!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. టీడీపీకి కంచుకోటగా భావించే తూర్పు గోదావరిలో ముసలం మొదలైంది. పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ.. కొత్త జోష్ నింపేందుకు జిల్లాకు వచ్చిన అధినేత చంద్రబాబు పిలిచినా సీనియర్ నేత ససేమిరా అన్నారు. చంద్రబాబు ప్రతినిధులు వచ్చినా తాను సమీక్షకు రానని తేల్చి చెప్పారు. జిల్లాలో టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న తోట త్రిమూర్తులు ..ఆయన వర్గం చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉన్నారు. ఆయనను బుజ్జగించేందుకు బాబు ప్రయత్నాలకు తోట త్రిమూర్తులు వర్గం స్పందించలేదు. తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతున్నారని..ఇటీవలే ఆయన ముఖ్యమంత్రి జగన్ తోనూ సమావేశమయ్యారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన వైసీపీ లో చేరుతారని టీడీపీ నేతలే చెబుతున్నారు.
చంద్రబాబు పిలిచినా..రాని త్రిమూర్తులు
తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు ఎన్నికల ఫలితాల తరువాత తొలి సారి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్కడి పరిస్థితి అర్దం అయింది. పార్టీలో సీనియర్లను బుజ్జగించి..తిరిగి పార్టీలో జోష్ నింపేందుకు చంద్రబాబు జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేత తోట త్రిమూర్తులతో సహా ఆయన వర్గం నేతలు హాజరు కాలేదు. సమావేశానికి రాకుండా వెంకటాయపాలెంలోనే త్రిమూర్తులు ఉండిపోయారు. సమావేశానికి రావాలని చంద్రబాబు వద్ద నుంచి పిలుపు వచ్చినట్లు తోట సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు చంద్రబాబు, త్రిమూర్తులు మధ్య రాయబారం నడిచింది. అయితే తాను టీడీపీకి రాజీనామా చేయలేదని, పార్టీలోని కొందరు ముఖ్యుల వైఖరితో మనస్తాపం చెందానని, రాయబారానికి వచ్చిన నేతలకు త్రిమూర్తులు స్పష్టం చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసంతృప్తులపై తర్వాత సమీక్షించుకుందామని నేతలు ఆయనకు చెప్పారు. నేతలు బుజ్జగించినప్పటికీ సమావేశానికి రాలేనని త్రిమూర్తులు తేల్చిచెప్పారు.
జగన్ తో త్రిమూర్తులు భేటీ..!!
ఎన్నికల ముందు నుండి త్రిమూర్తులు పార్టీ మారుతారనే ప్రచారం సాగింది. అయితే చంద్రబాబు బుజ్జగింపులతో ఆయన మెత్తబడ్డారు. ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ లోని కాపు నేతలతో ఆయన కాకినాడ లో సమావేశం ఏర్పాటు చేసారు. అందులో ఎన్నికల సమయంలో పార్టీలోని ముఖ్య నేతలు ప్రధానంగా లోకేశ్ కారణంగా నష్టం జరిగిందనే అభిప్రాయం వ్యక్తం చేసారు. ఒక వర్గానికి ఆర్దికంగా సహకారం అందించి కాపు నేతలను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తరువాత చంద్రబాబును కలిసారు. అప్పటి నుండి రాజకీయంగా మౌనం పాటిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో రాజధాని గురించి త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేసారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉండవచ్చంటూ సందేహం వ్యక్తం చేసారు. అదే సమయంలో రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల ఆస్తుల గురించి ప్రస్తావిస్తూ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరికి పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చి ఉండవచ్చని..మరి నారాయణకు అక్కడ భూములు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జిల్లా టీడీపీ నేతలు మాత్రం త్రిమూర్తులు ఇక పార్టీలో కొనసాగరని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల ఆయన సీఎం జగన్ను కూడా కలిసినట్లు సమాచారం. ఇప్పుడు చంద్రబాబు సమీక్ష్ కు డుమ్మా కొట్టటం.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం..ఇవన్నీ చూస్తుంటే ఆయన పార్టీ మారటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తన సోదరుడు తోట నరసింహం రాయబారం నడుపుతున్నట్లుగా చెబుతున్నారు.