యువకుడి హల్చల్... క్లాస్ రూమ్లోకి చొచ్చుకెళ్లి.. విద్యార్థినికి బలవంతంగా తాళి కట్టే యత్నం...
తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో కలకలం రేగింది. ఓ యువకుడు స్కూల్ విద్యార్థినికి బలవంతంగా తాళి కట్టేందుకు యత్నించాడు. క్లాస్ రూమ్లోకి చొరబడి మరీ ఈ దుశ్చర్యకు పూనుకున్నాడు. స్కూల్ సిబ్బంది అతన్ని అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికెళ్లాక పురుగుల మందు ఆత్మహత్యకు యత్నించాడు.
వివరాల్లోకి వెళ్తే... రాయవరం నియోజకవర్గంలోని అనపర్తి మండలం మహేంద్రవాడకు చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. సోమవారం(డిసెంబర్ 21) ఎప్పటిలాగే స్కూల్కి వెళ్లింది. బాలిక స్కూల్కు వెళ్లిన విషయాన్ని గమనించిన శివారెడ్డి అనే స్థానిక యువకుడు కాసేపటికి స్కూల్ వద్దకు వెళ్లాడు. ఇంకా క్లాసులు ప్రారంభం కాలేదని తెలుసుకుని ఆ బాలిక ఉన్న క్లాస్ రూమ్లోకి చొరబడ్డాడు.
వెంట తెచ్చిన తాళిని ఆమె మెడలో కట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ బాలిక,తోటి విద్యార్థినులు గట్టిగా కేకలు పెట్టారు. స్కూల్ సిబ్బంది వెంటనే పరిగెత్తుకురావడంతో శివారెడ్డి తాళిబొట్టును అక్కడే పడేసి పారిపోయాడు. ఈ వ్యవహారంపై బాలిక తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసి శివారెడ్డి పురుగుల మందు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతన్ని రాయవరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
బాలిక తండ్రి మాట్లాడుతూ... రెండు నెలలుగా శివారెడ్డి తన కూతురు వెంటపడుతున్నట్లు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని వేధిస్తున్నాడని... ఎన్నిసార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు లేదని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.