చైనాతో యుద్ధ మేఘాలు -తూర్పు నౌకాదళం అప్రమత్తం- సెలవులు రద్దు- పెరిగిన గస్తీ....
చైనా సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో ఎలాంటి పరిస్ధితిని అయినా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధమవుతోంది. అదే సమయంలో సైన్యానికి అండగా నిలిచేందుకు నౌకాదళం కూడా రంగంలోకి దిగుతోంది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం యుద్ద సన్నద్ధతను చాటుకునే ప్రయత్నాలను ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో చైనా నౌకల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు గస్తీని పెంచింది.
చైనా యాప్స్పై భారత్ నిషేధం... భేష్ అంటూ అమెరికా ప్రశంసలు...
తూర్పు కమాండ్ అలర్ట్....
గల్వాన్ లోయలో దాడుల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్ధితులను ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్దమవుతున్నాయి. ఇదే క్రమంలో విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న తూర్పు కమాండ్ కు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందాయి. దీంతో కొన్ని రోజులుగా తూర్పు కమాండ్ లో అలర్ట్ ప్రకటించారు. హిందూ మహాసముద్రంలో గస్తీని పెంచడంతో పాటు సిబ్బంది సెలవులను కూడా రద్దు చేశారు. తూర్పు నౌకాదళ పరిధిలోకి ఇతరుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు.
కవ్వింపు చర్యలను ఎదుర్కొనేందుకు...
హిందూ మహాసముద్రంలో చైనా నేవీ కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉందని తూర్పు కమాండ్ అంచనా వేస్తోంది. గతంలోనూ చైనా ఇలాంటి కవ్వింపు చర్యలు చేపట్టినా తూర్పు కమాండ్ వాటిని సమర్ధంగా తిప్పికొట్టింది. మన యుద్ధ సన్నద్ధతను తెలుసుకునేందుకు కూడా చైనా నేవీ ఇలా కవ్వింపులకు దిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా హిందూ మహసముద్రంలో తూర్పు కమాండ్ గస్తీ పెరిగింది. కోస్ట్ గార్డ్ నౌకలతో నిరంతరం సముద్రంలో పహారా కాస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ ప్రత్యర్ధి వ్యూహాలను అంచనా వేస్తున్నారు.
Recommended Video
పైలట్లకు శిక్షణ ముమ్మరం...
చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో విశాఖలోని తూర్పు నేవల్ కమాండ్ స్ధావరమైన ఐఎన్ఎస్ డేగాలో యుద్ధ విమానాల పైలట్లకు శిక్షణ తీవ్రతరం చేశారు. వాస్తవంగా ఏడాది పొడవునా ఇక్కడ పైలట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. కానీ ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో దీన్ని మరింత చురుగ్గా కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. దీంతో పాటు విశాఖ నగరంలోనూ అత్యాధునిక యుద్ధ విమానాలతో పైలట్లు చక్కర్లు కొడుతూ యుద్ధ సన్నద్ధతను తెలియజేస్తున్నారు.