జనసేన పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ, 2019లో ఏపీ-తెలంగాణ ఈ గుర్తుపైనే పోటీ
అమరావతి: పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ మేరకు శనివారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జనసేన పార్టీకి ఉమ్మడి గుర్తు లభించింది. గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 42 లోకసభ నియోజకవర్గాలున్నాయి. 2019లో జరగనున్న ఏపీలోని 25 లోకసభ, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలలో ఈ గుర్తుపై పోటీ చేస్తుందని ఈసీ తెలిపింది.
2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు. పార్లమెంటు సాధారణ ఎన్నికలతోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇదే గుర్తు వర్తిస్తుంది. ఈ ఎన్నికల గుర్తు అప్పుడే ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది.
JanaSena election symbol "Glass Tumbler "
— JanaSena Party (@JanaSenaParty) December 22, 2018
జనసేన ఎన్నికల గుర్తు "గాజు గ్లాస్" pic.twitter.com/zhs69dvAVd