Atchannaidu: సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్ సర్కార్కు చెంపపెట్టు, సీజేఐపై కూడా ఆరోపణలు..?
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు తీర్పు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని మాజీమంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. ఇకనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు లెంపలు వేసుకొని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించబోమని సర్వోన్నత న్యాయస్థానం గుర్తుచేసిన అంశాన్ని అచ్చెన్నాయుడు ప్రస్తావించారు.
వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా ప్రభుత్వం ప్రకటనలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటీ నుంచి ఈసీకే సర్వాధికారాలు ఉంటాయని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా జడ్జీది ఏ కులం అని, ఆయనకు కూడా జగన్ కులం ఆపాదించే అవకాశం ఉందన్నారు. తమకు 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీరాలు పోయే ఛాన్స్ ఉందన్నారు.
Recommended Video
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఈసీ రమేశ్ కుమార్ ఆదివారం ప్రకటించారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. రమేశ్ కుమార్ నిర్ణయాన్ని అధికార వైసీపీ తప్పుపట్టింది. చంద్రబాబు నాయుడు మనిషి.. రమేశ్ కుమార్ అని ఆరోపించింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్ను సర్వోన్నత ధర్మాసనం బుధవారం విచారించింది. ఈసీ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే విపక్ష నేతలు వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.