జేసీకి ఈసీ షాక్ : ఓటుకు నోటు కామెంట్లపై చర్యలు, కలెక్టర్కు ఆదేశం
అమరావతి : ఓటుకు రూ.2 వేలు చొప్పున రూ.50 కోట్లు ఖర్చుచేశామని జేసీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. టీడీపీ ఎంపీ, సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ, సీపీఐ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లగా .. జేసీ కామెంట్లపై చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించింది.
ఓటు రూ.2 వేలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా జేసీ దివాకర్ రెడ్డి తన నోరు పారేస్తున్నారు. ఎన్నికలు చాలా కాస్ట్లీ అయ్యాయని .. ఓటుకు రూ.2 వేలు ఇవ్వాల్సి వస్తోందని పేర్కొన్నారు. అంతేకాదు చదువురాని వారు కూడా ఓటుకు రూ.5 వేలు అడుగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో అసెంబ్లీకి రూ.50 కోట్లు ఖర్చుచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. అనంతపురం లోక్ సభ నుంచి జేసీ కుమారుడు పవన్ బరిలో ఉండగా .. తాడిపత్రి అసెంబ్లీ నుంచి జేసీ తమ్ముడు ప్రభాకర్ కుమారుడు అస్మిత్ పోటీ చేశారు.
ఈసీకి ఫిర్యాదు ..
జేసీ వ్యాఖ్యలను విపక్ష వైసీపీ, సీపీఐ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం స్పందించింది. జేసీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నిర్ధారణకు వచ్చిన ఈసీ చర్యలకు ఉపక్రమించింది. దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించింది. దీంతో జేసీ వ్యాఖ్యలను పరిశీలించి .. చట్టప్రకారం చర్యలు తీసుకొని నివేదిక సమర్పిస్తానని కలెక్టర్ ఈసీకి నివేదించారు.
నల్లధనమట ...?
తొలుత అసెంబ్లీ, లోక్ సభ స్థానాల వ్యయం గురించి మాట్లాడిన జేసీ .. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే ప్రధాన పార్టీల వ్యయం గురించి మాట్లాడి తన నోటిదురుసును ప్రదర్శించారు. ఆయా పార్టీలు రూ.8 నుంచి 10 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇదంతా నల్లధనమేనని సెలవిచ్చారు. దీనిపై కూడా విపక్షాలు మండిపడ్డాయి.
జేసీతో చేటు ?
స్వపక్షంలోనే విపక్షంలా మెలిగే జేసీతో ఆ పార్టీ మంచి ఎంతో చేటు అంతే జరుగుతోంది. ఒక్కోసారి ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తోంది. ఓటుకు రూ.2 వేలు అంశంపై ఈసీ స్పందించి .. చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. దీనికితోడు పార్టీల నల్లధనం వ్యాఖ్యలు కూడా వెంటాడుతాయి. ఇప్పటికే ఏపీలో పోలింగ్ శాతం పెరిగి ... ఆ పార్టీ అధినేత లెక్కలు కడుతూ మునిగితేలుతుంటే .. జేసీ రూపంలో మరో టెన్షన్ మొదలైంది.