ఏపీలో ఓటర్ల జాబితాల సవరణకు ఈసీ నోటిఫికేషన్- ముఖ్యమైన తేదీలివే...
ఏపీలో ఓటర్ల జాబితాల సవరణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేకపోయినా ఏటా జరిగే సవరణల్లో భాగంగా తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ వచ్చే ఏడాది జనవరి 15న తుది జాబితాల ప్రచురణతో ముగియనుంది.
ఏపీలో ఓటర్ల జాబితాల సవరణ కోసం ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం పోలింగ్ కేంద్రాల పునర్ వ్యవస్ధీకరణతో ఈ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. అక్టోబర్ 31 వరకూ ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, కొ్త్త పేర్లను చేర్చడం, మృతులను జాబితాలో నుంచి తొలగించడం వంటి కార్యక్రమాలు చేపడతారు. నవంబర్ 16న ముసాయిదా జాబితా ప్రచురిస్తారు. డిసెంబర్ 15 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 5 వరకూ వీటి పరిష్కారం ఉంటుంది. జనవరి 14 వరకూ డేటా బేస్ అప్డేట్ చేస్తారు. ఆ తర్వాత జనవరి 15న తుది జాబితా ప్రచురిస్తారు.
నవంబర్ 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 12, 13 తేదీల్లో ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ ప్రకటించారు. వచ్చే జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండబోతున్న ఓటర్లు కూడా నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 వరకూ ఆన్లైన్ లోనూ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.