టీవీ రిపోర్టర్ల దందా: డబ్బులు గుంజుతుండగా పోలీసుల పట్టివేత
విశాఖపట్నం: గంజాయి స్మగ్లర్ల నుంచి డబ్బులు గుంజేందుకు మాటు వేసిన ఎలక్ర్టానిక్ మీడియా విలేకరులను పోలీసులు పట్టివేశారు. విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలానికి చెందిన ఎలక్ర్టానిక్ మీడియా ప్రతినిధులు ఎస్.రమేష్, ఎస్.ప్రసాద్లతోపాటు మరికొంతమంది శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వడ్డాది వద్ద మాటువేశారు.
ఆ మార్గంలో గంజాయితో వచ్చే వాహనాలను ఆపి డబ్బు గుంజాలని ఎత్తు వేశారు. ఇంతలో ఒడిశా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉన్న ఒక కారు అటుగా వచ్చింది. అది గంజాయి అక్రమ రవాణా వాహనమేనని భావించిన మీడియా ప్రతినిధులు కర్రలతో రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆ వాహనాన్ని నిలిపివేశారు. కారును తనిఖీ చేయాలని లోపలున్నవారిని గద్దించారు.
దాంతో కథ అడ్డం తిరిగింది. వారు అనుకున్నట్టు లోపల ఉంది గంజాయి స్మగ్లర్లు లేరు. అందులో స్పెషల్ పార్టీ పోలీసులున్నారు. వారి సీఐ కె.సూర్యనారాయణ కూడా కారులోనే ఉన్నారు. మీడియా హడావుడిని గమనించిన ఆయన తనిఖీ చేయడానికి మీరెవరంటూ వారిని నిలదీశారు. గంజాయి రవాణా చేస్తున్న వాహనం వస్తోందని సమాచారం రావడంతో కాపు కాశామని వారు ఆయనకు చెప్పారు.
వాహనాన్ని అడ్డుకునేందుకు కర్రలు దేనికంటూ ఇద్దరు మీడియా ప్రతినిధులనూ పట్టుకుని బుచ్చెయ్యపేట పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై సీఆర్పీసీ 170, 353, 341, 342, 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం వారు బెయిలుపై విడుదలయ్యారు.