జగన్కు షాక్: అటాచ్కు ఈడి న్యాయప్రాధికార సంస్థ ఓకే
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఈడి మూడోసారి అటాచ్ చేసిన ఆస్తులను ఈడి న్యాయప్రాదికారిక సంస్థ సోమవారం ధృవీకరించింది. జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడులపై ఈడి తీర్పు జగన్కు షాక్ వంటిదని చెప్పవచ్చు.
మూడోసారి అటాచ్ చేసిన రూ.34.66 కోట్ల పెట్టుబడులను ఈడి అటాచ్ చేయడం సరైనదేనని న్యాయప్రాధికారిక సంస్థ అభిప్రాయపడింది. మాధవ రామచంద్రన్, ఎకె దండమూడి, టిఆర్ కన్నన్లు పెట్టిన పెట్టుబడులను ఈడి అటాచ్ చేసింది.
కాగా, మూడోసారి జగన్ ఆస్తులను ఆరు నెలల క్రితం ఈడి జప్తు చేసింది. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో గల ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్లోని 34.66 కోట్ల రూపాయల విలువ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఈడి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈడి శుక్రవారం ప్రకటన జారీ చేసింది. ఎకె దండమూడి, కన్నన్, మాధవ్ రామచంద్రన్ పెట్టిన పెట్టుబడులను జప్తు చేస్తున్నట్లు ఈడి తెలిపింది.
కుట్ర, మోసం ద్వారా నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయిందని, అందుకే ఫిక్స్డ్ డిపాజిట్లను జప్తు చేస్తున్నామని ఈడి తెలిపింది. కన్నన్ జగన్ సంస్థల్లో ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. మాధవ్ రామచంద్రన్ దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త. ప్రస్తుత జప్తుతో ఈడి ఇప్పటి వరకు మూడు సార్లు జగన్ కేసులో అస్తులను జప్తు చేసినట్లయింది.
మూడు విడతలు మొత్తం 229.40 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది. ఇంతకు ముందు 143.74 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను, మూడు ఫార్మా కంపెనీలకు, జననీ, జగతి సంస్థలకు సంబంధించి 51 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది.