జగన్ కేసులో ఈడీ మరో చార్జిషీట్: అవి క్విడ్ ప్రో కో పెట్టుబడులే
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ అధికారులు శుక్రవారం చార్జిషీట్ను సమర్పించారు. ఫార్మా కంపెనీలకు భూకేటాయింపులకు సంబంధించి చోటుచేసుకున్న అక్రమాలపై ఈ చార్జిషీటు దాఖలైంది.
హెటిరో, అరబిందో, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు జగనకు చెందిన సంస్థల్లో రూ.29.5 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనికి ప్రతిగా ఆయా కంపెనీలకు వైఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములను కేటాయించిందని ఈడీ చార్జిషీటులో ఆరోపించింది.
అరబిందో ఫార్మా ఎండీ నిత్యానందరెడ్డి భార్య రాజేశ్వరి రూ.2 కోట్లు, ఆయన సోదరుడు కోటి రూపాయలు, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ రూ.7 కోట్లు, హెటిరో డ్రగ్స్ రూ.19.5 కోట్లు జగన సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.
ఈ మొత్తం వ్యవహారంపై మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, బీపీ ఆచార్యతోపాటు మొత్తం 19 మందిని నిందితులుగా పేర్కొంది. ఈడీ తాజాగా దాఖలు చేసిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉంది.
అరబిందో ఫార్మాకు జడ్చర్ల ఫార్మా సెజ్లో 75 ఎకరాలు కేటాయించాల్సిందిగా అరబిందో ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ కె.నిత్యానందరెడ్డి 2006 నవంబర్లో ఏపీఐఐసీకి లేఖ రాశారు. అక్కడ ఎకరా రూ.15 లక్షలు ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఎకరాకు రూ.7 లక్షలుగా నిర్ణయించి, భూమిని కేటాయించారు. ఫలితంగా కంపెనీకి రూ.8.60 కోట్ల లబ్ధి చేకూరింది. అరబిందో తరహాలోనే హెటిరో డ్రగ్స్కు కూడా ఎకరా రూ.7 లక్షల చొప్పున 75 ఎకరాలు కేటాయించారు. ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థ అరబిందో అనుబంధ సంస్థ కానప్పటికీ ఏపీఐఐసీకి తప్పుడు సమాచారం ఇచ్చారు.
అరబిందోకు పాశమైలారంలో కేటాయించిన భూమిలో 30.33 ఎకరాలను ఈ సంస్థకు బదిలీ చేసేందుకు నాటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంగీకరించింది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు కేవలం 2 శాతం మాత్రమే వసూలు చేశారు. ఈ మొత్తం వ్యవహారాలకు అప్పటి ఏపీఐఐసీ ఎండీ బీపీ ఆచార్య పూర్తిగా సహకరించినట్లు అభియోగపత్రంలో చెప్పారు.
జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రా, అరబిందో ఛైర్మన్ పీవీ రామ్ప్రసాద్రెడ్డి, ఎండీ నిత్యానందరెడ్డి, ట్రైడెంట్ మాజీ ఎండీ శరత్ చంద్రారెడ్డి, నిత్యానందరెడ్డి సోదరుడు కె.ప్రసాద్రెడ్డి, నిత్యానందరెడ్డి భార్య రాజేశ్వరి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, హెటిరో డ్రగ్స్, హెటిరో ల్యాబ్స్, హెటిరో హెల్త్కేర్, అరబిందో ఫార్మా, ఏపీఎల్ హెల్త్, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, బీపీ ఆచార్య, విశ్రాంత జీఎం వైవీఎల్ ప్రసాద్, అరబిందో మాజీ సీఎస్ చంద్రమోహన్లపై అభియోగాలు మోపుతూ నిందితులుగా పేర్కొంది.