సీఎం జగన్కు ఈడీ కోర్టు సమన్లు.. ఆరోజు విచారణకు హాజరుకావాల్సిందే..!
గత కొద్దిరోజులుగా సైలెంట్గా ఉన్న జగన్ ఆస్తుల విచారణ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన బిజీ షెడ్యూల్ కారణంగా కోర్టుకు హాజరు కావడం లేదు. ఇందుకోసం ఆయన అన్ని అనుమతులు పొందారు. తాజాగా సీఎం జగన్కు ఈడీ కోర్టు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లలో కోర్టు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఈ మధ్యనే అరబిందో, హెటిరో భూ కేటాయింపుల వ్యవహారంలో దాఖలు చేసిన ఛార్జ్షీట్ నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు బదిలీ అయ్యింది. బదిలీ అయిన ఈ చార్జ్షీట్ను విచారణ చేపట్టేందుకు ఈడీ కోర్టు ఆమోదం తెలుపుతు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో సీఎం జగన్తో పాటు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హెటిరో డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, అరబిందో ఎండీ నిత్యానందరెడ్డి, పీవీ రాంప్రసాద్రెడ్డి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డికి ఈడీ కోర్టు సమన్లు జారీ చేసింది.
Recommended Video
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం జగన్ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే 11వ తేదీ హాజరుకావాల్సిందిగా ఈడీ కోర్టు సమన్లలో పేర్కొంది. అయితే అదే రోజున సీఎం జగన్ పలు సంక్షేమ పథకాలు ప్రారంభించాల్సి ఉంది. అంతకంటే ముందు సోమవారం రోజున అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వ్యాక్సిన్ సరఫరాపై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత సీఎం జగన్ అమ్మ ఒడి రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈడీ జారీ చేసిన సమన్లను అనుసరించి కోర్టుకు హాజరవుతారా లేక పలు కార్యక్రమాలు ఉన్నందున హాజరు మినహాయింపు కోరతారా అనేది వేచి చూడాలి.