చక్రం తిప్పుతున్న పురంధేశ్వరి, బాబుకు షాక్: బీజేపీలోకి టీడీపీ కీలక నేత మోహన్
ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగలనుంది. జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది.
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగలనుంది. జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం.
Recommended Video
పిడిసిసిబి ఛైర్మెన్ పదవికి ఈదర మోహన్ రాజీనామా: తెర వెనుక దామరచర్ల?
మంగళవారం విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరితో ఈదర చర్చించారు. ఈ సందర్భంగా బీజేపీలో చేరే అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఆయన సెంట్రల్ బ్యాంకు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
జగన్ నో, బీజేపీలోకి సీకే బాబు: అలాంటి టైంలో పురంధేశ్వరి చక్రం తిప్పారా?
టీడీపీ పరిణామాలతో ఈదర మనస్తాపం
టీడీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన ఆవేదన చెంది, బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఓ కీలక నేత అండతో కొందరు డైరెక్టర్లు తనపై తిరుగుబావుటా ఎగురవేశారని మోహన్ భావిస్తున్నారు. అంతకుముందు తనకు మద్దతుగా ఉన్న వారు కొద్దిరోజుల్లోనే తిరుగుబావుటా ఎగరవేశారు. దీనిపై అధిష్టానం కూడా సరైన విధంగా వ్యవహరించలేదని భావిస్తున్నారు.
పదవికి రాజీనామా చేసినా అధిష్టానం స్పందించలేదని
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సర్దుబాటు ప్రయత్నాలు చేసినా అది జరగలేదని తెలుస్తోంది. తాను చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత అధిష్టానం నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడం ఆయనను బాధించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.
పురందేశ్వరితో భేటీ
పురంధేశ్వరి భర్ద దగ్గబాటి వెంకటేశ్వర రావుతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. టీడీపీలోని ప్రస్తుత పరిస్థితికి ఇవి కూడా కలిసి వచ్చినట్లుగా భావిస్తున్నారు. గతంలో మోహన్ చైర్మన్ అయ్యేందుకు దగ్గుబాటి కూడా సహకరించారు. కాగా, ఇటీవల చిత్తూరు జిల్లాకు చెందిన సీకే బాబు బీజేపీలో చేరడం వెనుక పురంధేశ్వరి పాత్ర ఉంది. ఇప్పుడు ఈదర మోహన్ కూడా అటువైపు అడుగులు వేస్తున్నారు.
విజయవాడలో కమలం పార్టీ చేరనున్నారు
ఇప్పుడు టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్న ఆయనను మంగళవారం పురంధేశ్వరి కలిశారని, త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది. త్వరలో విజయవాడలో కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు.
ఇదీ ఈదర మోహన్
కాగా, తొలుత టీడీపీలో ఉన్న ఈదర మోహన్, ఆ తర్వాత కాంగ్రెస్లోచేరి, అనంతరం మళ్లీ టీడీపీలోకి వచ్చారు. కాగా, 1994లో టీడీపీ, 2004, 2009లలో కాంగ్రెస్కు, 2014లో టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించారు.